దేశానికే ఆదర్శవంతంగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ నిలుస్తున్నదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, ఊరగుట్టపై ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ స్థలంలో నూతనంగా నిర్మిస్తున్న మోడల్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శనివారం సీపీ.. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్ రాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ…సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నాలుగు మోడల్ పోలీస్స్టేషన్లను నిర్మిస్తున్నామని.. అందులో కడ్తాల్, నందిగామ, శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్లకు శంకుస్థాపన చేశామని.. తాజాగా బాచుపల్లిలో శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థలో తాము సక్సెస్ అయ్యామన్నారు. అధునాతన పోలీస్స్టేషన్ భవన నిర్మాణానికి అరబిందో ఫార్మా పరిశ్రమ యాజమాన్యం ముందుకు వచ్చి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్ఆర్) కింద రూ.3.13 కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అరబిందో ఫార్మా చైర్మన్ నిత్యానందరెడ్డి, అరబిందో ప్రతినిధి శరత్చంద్రారెడ్డిలను అభినందించారు. అనంతరం పోలీస్స్టేషన్ నిర్మాణ ప్రాంతంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో నిజాంపేట మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, ఏసీపీ సురేందర్రావు, బాచుపల్లి, ఆర్సీ పురం ఇన్స్పెక్టర్లు నర్సింహారెడ్డి, జగదీశ్వర్, కార్పొరేటర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.