సిటీబ్యూరో, జూన్ 28(నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ట్రాన్స్జెండర్స్తో కలిసి ప్రైడ్-డే వేడుకలను నిర్వహించారు. ట్రాన్స్జెండర్స్ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్స్ హెల్ప్ డెస్క్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా ప్రతిభ ఉన్న ముగ్గురు ట్రాన్స్జెండర్స్కు ఉద్యోగాలు వచ్చేలా చేసి.. వారికి అపాయింట్మెంట్ లేఖలను అందించారు. ఈ సందర్భంగా వివిధ వృత్తి, వ్యాపారాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ఆరుగురిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు. అనంతరం పోలీసు కమిషనర్ కార్యాలయంలో ప్రైడ్ డేను పురస్కరించుకుని బెలూన్లను ఎగుర వేశారు. ఈ సందర్భంగా హెల్ప్డెస్క్ను నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు, వీరి ప్రతిభను గుర్తించి సహకరిస్తున్న సంస్థలను సీపీ సజ్జనార్ అభినందించారు. తెలంగాణ పోలీసు, సైబరాబాద్ పోలీసులు ట్రాన్స్జెండర్స్ సంక్షేమానికి అండగా ఉంటుందని సీపీ పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలని సీపీ కోరారు.