కేపీహెచ్బీ కాలనీ, జూలై 13 : సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ సజ్జనార్ అన్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సైబర్ సిటీ రెయిన్బో విస్తాస్ నివాసితులకు మంగళవారం సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీ సజ్జనార్, సైబర్ క్రైం ఏసీపీ బాలకృష్ణారెడ్డి, డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ సురేందర్రావు, సీఐ నర్సింగరావు హాజరై మాట్లాడుతూ.. నగరంలో ఏడు లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో సాధారణ నేరాలు తగ్గాయన్నారు. కాని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని, అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సైబర్ సిటీ డెవలపర్స్ ఎండీ వేణు వినోద్, రెయిన్బో విస్తాస్ అధ్యక్షుడు నాగేంద్రబాబు, మాజీ అధ్యక్షుడు చల్లా మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.