మన్సూరాబాద్, జూలై 30: ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుని పెండ్లి సంబంధాల పేరుతో.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. గిఫ్ట్ ప్యాక్లు వచ్చాయంటూ.. పలు విధాలుగా ప్రజలను మోసగిస్తున్న కేసుల్లో ఓ నైజీరియన్తో పాటు మరో వ్యక్తిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఫిడలిస్ ఒబిన్న విజిట్ వీసాపై ఇండియాకు వచ్చాడు. న్యూఢిల్లీలో ఉంటూ సైబర్ మోసాలకు తెరలేపాడు. విదేశాల్లో ఉద్యోగాలు, గిఫ్ట్లు, మ్యాట్రిమోనియల్ ద్వారా పెండ్లి సంబంధాల పేరుతో అమాయకులకు ఎరవేసి మోసం చేస్తున్నాడు. ఫిడలిస్కు బీహార్లోని ముజఫర్నగర్కు చెందిన అనిల్కుమార్ పాండే సహకరించాడు.
వెస్ట్ ఢిల్లీ ఉత్తమ్నగర్లో ఉంటున్న పాండే.. కిరాణా షాపు ముసుగులో 13 బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేసి 19 స్వైప్ మిషన్లు, 65 డెబిట్, క్రెడిట్ కార్డులు సమకూర్చుకున్నాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు.. ఫిడలిస్ ఒబిన్న, అనిల్కుమార్ పాండేను ఈనెల 18న ఢిల్లీలో అరెస్ట్ చేసి, ట్రాన్సిట్ వారెంట్పై నగరానికి తీసుకువచ్చి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి రూ.30 వేల నగదు, వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ. 6.27 లక్షలు సీజ్ చేశారు. పాస్పోర్టుతో పాటు 19 స్వైపింగ్ మిషన్లు, 65 డెబిట్, క్రెడిట్ కార్డులు, వివిధ బ్యాంకులకు చెందిన 13 చెక్బుక్స్, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.హరినాథ్, సీఐ ఆర్.వెంకటేశ్ పాల్గొన్నారు.
మన్సూరాబాద్, జూలై 30 : ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ నేపాల్ దేశస్తుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ మహేశ్భగవత్ వివరాలు వెల్లడించారు. నేపాల్కు చెందిన తార బహదూర్ (33) ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉంటున్నాడు. ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్ ద్వారా పరిచయాలు పెంచుకుని సైబర్ నేరాలు మొదలుపెట్టారు. బ్యాంకు సిబ్బంది సహకారంతో వివిధ పేర్లతో పలు బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేశాడు. ఆన్లైన్ ద్వారా సామాన్య ప్రజలను పరిచయం చేసుకుని రూ. 500 పెట్టుబడిగా పెడితే రూ.1000 ఇస్తానంటూ నమ్మించాడు. దీంతో ప్రజలు ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపించారు. ప్రజల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి నేరగాళ్లు చెల్లించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈనెల 19న న్యూఢిల్లీలో నిందితుడిని అరెస్టు చేశారు.