హైదరాబాద్ : రంజాన్ పర్వదినం వేళ మక్కా మసీదులో ప్రార్థనలు నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా మక్కా మసీదులో కేవలం ఐదుగురితో మాత్రమే ప్రార్థనలు నిర్వహించారు. పాతబస్తీలోని అన్ని మసీదుల్లో ప్రార్థనలు ముగిశాయి. మసీదుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రంజాన్ వేడుకల నేపథ్యంలో చార్మినార్, మక్కా మసీదు ఏరియాలో నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడారు. ముస్లింలు అందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించారు అని తెలిపారు. ప్రతీ మసీదులో ముగ్గురు లేదా నలుగురు కలిసి ప్రార్థనలు నిర్వహించారు. మిగతా వారందరూ తమ నివాసాల్లోనే ప్రార్థనలు నిర్వహించి పోలీసులకు సహకరించారు. లాక్డౌన్ నిబంధనలు పాటించిన ముస్లింలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు.