వెంగళరావునగర్, సెప్టెంబర్ 25: జీవితంలో ఎదగాలంటే పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోవాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. టీఎంఐ గ్రూపు సంస్థలు, పంజాగుట్ట పోలీసు స్టేషన్ ఆధ్వర్యంలో అమీర్పేటలోని కమ్మ సంఘం హాల్లో శనివారం ఉద్యోగ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీ అంజనీ కుమార్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత 2021 సంవత్సరంతో పాటు రాబోయే కాలంలో దేశ వ్యాప్తంగా ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయన్నారు. ప్రైవేటు రంగం కొత్త పుంతలు తొక్కుతోందని, మార్కెట్లో వ్యాపార, ఉద్యోగ అవకాశాలు పెరిగిపోతున్నాయన్నారు. అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే జీవితంలో స్థిరపడగలమన్నారు.
జీవితం ఓ పెద్ద ప్రయాణమని, ఎన్నో మైళ్ల దూరం ప్రయాణించాలంటే ముందు ఒక్క అడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద ఉద్యోగం రాలేదని, సరిపడే వేతనం దొరకలేదని నిరుత్సాహ పడకూడదన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాలో అన్ని సంస్థలు ఒకే చోట చేరి, అవసరమైన వారికి ఉద్యోగాలిచ్చే అవకాశం కల్పించిన పోలీసు అధికారులను, పంజాగుట్ట, ఎస్సార్ నగర్ పోలీసులను అభినందించారు. డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ వెస్ట్ జోన్ పరిధిలో ఇప్పటి వరకు ఏడుసార్లు ఉద్యోగ మేళాలను నిర్వహించామన్నారు. ఈ మేళాల ద్వారా 10వ తరగతి నుంచి ఆ పై విద్యావంతులకు తగిన ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.
ఈ తరహా అవకాశాలను యువతీ యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేళా నిర్వాహకులైన టీఎంఐ గ్రూపు సీఓఓ పీటర్ బల్లెం మాట్లాడుతూ సీఎస్ఆర్ కార్యక్రమం ద్వారా ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. గత రెండేళ్లలో 9 వేల మంది విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసినట్లు తెలిపారు. అంతకు ముందు మేళా ద్వారా ఆయా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీపీ అంజనీ కుమార్, డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తదితరులు నియామక పత్రాలను అందజేశారు. ఆయా సంస్థల్లో ఉద్యోగ అవకాశాల కోసం వచ్చిన వారితో కమ్మ సంఘం హాల్ నిండిపోయింది. కార్యక్రమంలో వెస్ట్ జోన్ అదనపు డీసీపీ ఎం.ఇక్బాల్ సిద్ధిఖీ, పంజాగుట్ట ఏసీపీ పీవీ గణేష్, ట్రాఫిక్ ఏసీపీ జ్ఞానేందర్ రెడ్డి, పంజాగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.