బేగంపేట్ జూలై 20: సికింద్రాబాద్లో జూలై 25, 26వ తేదీల్లో జరిగే ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరను భక్తులు సమన్వయం, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కోరారు. భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. జాతరను పురస్కరించుకొని మంగళవారం మహంకాళి దేవాలయం ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పోలీసు అధికారులు సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ ఆలయం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి భద్రత ఏర్పాట్లను ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్ను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. కరోనా పూర్తిగా పోలేదన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ నడుస్తున్నప్పటికీ భక్తులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ఉత్సవాల్లో పాల్గొనాలని సూచించారు. 2500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళా భక్తులను దృష్టిలో పెట్టుకొని.. మహిళా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బోనాలతో వచ్చే మహిళలకు రెండు క్యూ లైన్లు ఉంటాయని పేర్కొన్నారు.
దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉండే సీసీ కెమెరాలతో పాటు అదనంగా పోలీసు ఐటీ సెల్ ద్వారా 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు అర్థమయ్యేలా పార్కింగ్ సూచికలు, రూట్ మ్యాపులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీఐపీ పాస్ల జారీలో సమయం కేటాయించి వివిధ దశల్లో అనుమతి ఉంటుందని చెప్పారు. అనంతరం ఉత్తర మండలం జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారని, ఆలయ పరిసరాల్లో 50 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో పారిశుధ్య పనులతో పాటు హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్లు మరమ్మతులు కూడా చేపడుతున్నామని, మరికొన్ని వీధి దీపాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అదనపు కమిషనర్లు చౌహాన్, షీఖా గోయల్, అనిల్కుమార్, డీసీపీలు రాధాకృష్ణ, డీఎం అండ్ హెచ్వో వెంకటి, ఆలయ ఈవో మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.