సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ): నగరంలో ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. సోమవారం నగర పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను సీపీ వివరించారు. హైదరాబాద్ నగరం మతసామరస్యానికి చిహ్నంగా పేరొందిందన్నారు. బోనాలు, బక్రీద్ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలను కోరారు. 24 గంటలు పోలీసు బందోబస్తు ఉంటుందని, ఏదైనా సమస్య వస్తే వెంటనే డయల్ 100కు, లోకల్ పోలీస్, పెట్రోలింగ్కు ఫోన్ చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాన్ని ఉల్లంఘించొద్దని హెచ్చరించారు.
నగరంలో ఎస్ఆర్నగర్, ఆసిఫ్నగర్, కార్ఖానాతో పాటు మరిన్ని కొత్త పోలీస్స్టేషన్లను ప్రభుత్వం నిర్మించి ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖకు ఎంతో ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నదంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పోలీసు శాఖలో 30 శాతం మహిళా సిబ్బందిని తీసుకొని, దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. కొత్త బ్యాచ్లో రిక్రూట్ అయి విధుల్లో చేరిన మహిళా సిబ్బంది అన్ని విభాగాల్లో బాగా పనిచేస్తున్నారన్నారు.
పనిలో ప్రతిభ కనబర్చిన మహిళా కానిస్టేబుళ్లకు జ్ఞాపికలు ఇచ్చి అభినందించారు. హైదరాబాద్ మెడికల్ క్యాపిటల్గా మారిందని, అందుకే తరుచూ పలు దవాఖానల నుంచి గ్రీన్ ఛానల్ కోరుతున్నారన్నారు. ఈ ఏడాది నగర ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో 17 సార్లు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి, లైవ్ ఆర్గాన్ను వివిధ దవాఖానలకు తరలించామన్నారు. ఆపరేషన్ ముస్కాన్ కొనసాగుతుందని, జూలై 1 నుంచి 18వ తేదీ వరకు 272 మంది చిన్నారులను కాపాడినట్లు తెలిపారు.
నగర పోలీసు ఆధ్వర్యంలో 2015లో హాక్ ఐ యాప్ను ప్రారంభించామని సీపీ తెలిపారు. హాక్ ఐ ఉపయోగిస్తూ పౌర పోలీసింగ్ చేయవచ్చని పేర్కొన్నారు. నగరంలో పలువురి వద్ద నుంచి వివిధ కారణాలతో అదృశ్యమైన 30 సెల్ఫోన్లను ఐటీ సెల్ విభాగం ఐఎంఈఐ నంబర్ ఆధారంగా గుర్తించిందన్నారు. వాటిని స్వాధీనం చేసుకొని, తిరిగి సోమవారం బాధితులకు సీపీ అప్పగించారు. హాక్ ఐలో దరఖాస్తు చేసుకుంటే, ఐఎంఈఐ ట్రాకింగ్తో పోయిన ఫోన్లు దొరికే అవకాశాలుంటాయని వివరించారు. ఐటీ సెల్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 535 సెల్ఫోన్లు రికవరీ చేసినట్లు వివరించారు. తాజాగా రికవరీ చేసిన ఫోన్ల విలువ రూ. 5 లక్షలు ఉంటుందని తెలిపారు.