సిటీబ్యూరో, మే 21(నమస్తే తెలంగాణ): ఉదయం 6 నుంచి పది గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉందని, అయితే ప్రజలు 9 నుంచి రోడ్లపైకి వస్తున్నారని, దీంతో రద్దీ ఎక్కువగా ఉంటున్నదని సీపీ అంజనీకుమార్ అన్నారు. నాలుగైదు రోజులకు సరిపోయే విధంగా నిత్యావసర సరుకులు తీసుకెళ్తే.. ప్రతిరోజూ బయటకు వచ్చే అవసరం ఉండదని సూచించారు. శుక్రవారం ఈస్ట్జోన్లో ఆయన లాక్డౌన్ అమలును పరిశీలించారు. అనంతరం తన కార్యాలయంలో మాట్లాడారు. పాసులను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిని కాంటాక్టు, నాన్ కాంటాక్టు విధానంలో గుర్తించి చలాన్లు జారీ చేస్తున్నామన్నారు. ప్రతి రోజూ 8 వేల నుంచి 8500 జరిమానాలు వేస్తున్నామని, సుమారు 700 వాహనాలను సీజ్ చేస్తున్నామన్నారు. ఆ వాహనాలను సాయంత్రానికి వదిలేస్తున్నామని చెప్పారు. ఇటీవల తమిళనాడు ఎన్నికల విధుల్లో పాల్గొన్న 700 మంది సిటీ పోలీస్ సిబ్బందిలో 45 మందికి పాజిటివ్ వచ్చిందని వివరించారు.
బంజారాహిల్స్,మే 21: కొందరు వాహనదారులు పోలీసులను బురిడీ కొట్టించేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తూ దొరికిపోతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో చెక్పోస్టుల వద్ద వాహనాలను తనిఖీలు చేస్తున్న సమయంలో పలువురు వాహనదారులు గతేడాది లాక్డౌన్ సమయంలో జారీ చేసిన పాసులను కారు అద్దానికి అతికించినట్లు గుర్తించారు.