45 ఏళ్ల నుంచి ఆపై వయస్సుగల వారు ఆన్లైన్లో పేర్లను నమోదు చేసుకోకుండా నేరుగా కూడా వ్యాక్సిన్ సెంటర్లకు వెళ్లి కరోనా టీకా వేయించుకోవచ్చని వైద్యాధికారులు తెలిపారు. గ్రేటర్లోని అన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, ఏరియా దవాఖానలు, జిల్లా దవాఖానలతో పాటు ఇతర ప్రత్యేక కేంద్రాల ద్వారా కూడా అర్హులైన వారికి టీకా వేస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
జలుబు, దగ్గు, జ్వరం, ఒంటినొప్పులు, పొత్తికడుపులో నొప్పి, వాంతులు, వికారం వంటి లక్షణాలున్న అనుమానితులు, పాజిటివ్గా నిర్ధారణ అయిన రోగులు బయటకు రావద్దని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కరోనా పరీక్షలు చేయించుకుని రిపోర్టు కోసం నిరీక్షించేవారు.. నివేదిక వచ్చే వరకు హోమ్ ఐసొలేషన్లో ఉండాలని, స్వల్ప లక్షణాలు, మధ్యస్థ లక్షణాలున్నవారు సైతం హోమ్ ఐసొలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వైరస్ ఉన్నట్లు నిర్ధారణ జరిగితే.. వెంటనే వైద్యుల సూచన మేరకు ఏదేని ప్రభుత్వ దవాఖానలో చేరడం ఉత్తమమని వైద్యులు సూచించారు.
తీవ్ర లక్షణాలున్నవారు గాంధీ దవాఖానలో చేరవచ్చని తెలిపారు. కరోనా రోగులకు సంబంధించి చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. హోమ్ ఐసొలేషన్ రోగులకు మెడికల్ కిట్స్ను పంపిణీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు చేస్తున్నందున అనుమానితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.