కరోనా టీకాపై ప్రజల్లో అపోహలు తొలగిపోయి అవగాహన పెరుగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా కరోనా టీకా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కరోనా టీకాపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తుండటంతో ప్రజలు టీకాలు వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రారంభంలో టీకా వేసుకునేవారి సంఖ్య వందల్లో ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య వేలల్లోకి చేరింది. ప్రతి టీకా పంపిణీ కేంద్రం ప్రజలతో రద్దీగా కనిపిస్తుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో పాటు ఆఫ్లైన్ వెసులుబాటు కూడా అందుబాటులోకి తీసుకురావడంతో చాలా మంది టీకాలు వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచే టీకా కేంద్రాల వద్ద క్యూ కడుతుండటం కనిపిస్తున్నది.
కరోనా టీకా ప్రారంభంలో 25శాతం దాటని వ్యాక్సినేషన్ వారం రోజుల్లోనే 50 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం టీకా వేసుకునే వారి సంఖ్య 50 శాతం దాటినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గ్రేటర్లో మార్చి నెల వరకు 15వేల నుంచి 20వేల లోపు వ్యాక్సినేషన్ వేసుకోగా ప్రస్తుతం 40 వేల మందికి పైగా ప్రతిరోజు టీకా తీసుకుంటున్నారు. గురువారం ఒక్కరోజే గ్రేటర్లో 40,117మంది టీకా తీసుకున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సెంటర్ల సంఖ్య పెంచడంతో పాటు ప్రతి కేంద్రంలో వ్యాక్సినేషన్ కౌంటర్లను సైతం పెంచినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో 300లకు పైగా ప్రభుత్వ కరోనా టీకా కేంద్రాలు పనిచేస్తున్నట్లు వివరించారు. టీకా పంపిణీ వేగవంతం కావడం వల్ల వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.