ఖైరతాబాద్, సెప్టెంబర్ 18 : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి వేళయింది. ఆదివారం నగరంలో జరుగనున్న శోభాయాత్రకు కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్లలో పెద్ద ఎత్తున విగ్రహాల నిమజ్జనం జరుగనున్నది. ఈ క్రమంలో వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా లక్ష మాస్కులు, శానిటైజర్లను సిద్ధంగా ఉంచారు. అవసరమైనచోట ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయటానికి ఎంటమాలజీ సిబ్బందిని ఏర్పాటు చేశారు.
నిమజ్జనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ అధికారులు 70 టాయిలెట్లను సిద్ధం చేశారు. నిజాం కళాశాల, పీపుల్స్ప్లాజా, పీవీ ఘాట్ వరకు 20 సింగిల్, 10 సీటర్స్ టాయిలెట్లు మూడు (మొత్తం 30), నిమజ్జన ఘాట్ పరిసరాల్లో మరో 20 టాయిలెట్లను అందుబాటులో ఉంచారు. వీటికి తోడు మొబైల్ టాయిలెట్లు కూడా ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ మార్గ్లో భక్తుల కోసం కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను నిర్వహిస్తున్నారు. ఏఎంవోహెచ్ భార్గవ్ నారాయణ నేతృత్వంలో వైద్య సిబ్బంది టీకా వేస్తారు. టీకా వేసుకోని వారు తమ ఆధార్ నంబర్, ఫోన్ నంబరు చెప్పాలన్నారు.