కరోనా వ్యాప్తికి అధికంగా అవకాశముండే సూపర్ స్ప్రెడర్ల (వాహకులు)కు టీకాలు వేసే ప్రక్రియ నగరవ్యాప్తంగా చురుగ్గా సాగుతున్నది. ప్రాంతాల వారీగా టీకా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 8 రోజుల్లో రికార్డుస్థాయిలో దాదాపు 2 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 18 నుంచి 45 ఏండ్ల వారు 77 శాతం మంది ఉన్నారు. గ్రేటర్వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది సూపర్ స్ప్రెడర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరో రెండురోజులపాటు కేంద్రాలు పనిచేయనుండడంతో మిగిలిన వారికి టీకా ఇప్పించేందుకు చర్యలను వేగవంతం చేశారు. ప్రధానంగా కూరగాయలు, పూలు, పండ్లు, మాంసం విక్రయదారులు, వీధి వ్యాపారులు, రేషన్ డీలర్లు, జర్నలిస్టులు, మందులు, విత్తన దుకాణాల సిబ్బంది, పెట్రోలుబంకు, గ్యాస్ డెలివరీ సిబ్బంది, ఆటో,క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యేకంగా టీకా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముందురోజే టోకెన్లు మంజూరు చేస్తుండడంతో ఈ కేంద్రాల వద్ద రద్దీ తప్పింది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 4 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి తెలంగాణ సర్కారు బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నది. ఒకవైపు లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే.. సూపర్ స్ర్పైడర్స్కు వ్యాక్సినేషన్ చేపట్టింది. ఈ ప్రక్రియ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దిగ్విజయంగా కొనసాగుతున్నది. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే 1.94 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేయడం విశేషం.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు మూడు లక్షల మంది వరకు సూపర్ స్ప్రెడర్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కూరగాయల వ్యాపారులు, డ్రైవర్లు, రేషన్ డీలర్లు, జర్నలిస్టులు ఇలా వివిధ వృత్తుల వారికి టీకాలు వేయడం వల్ల వైరస్ వ్యాప్తి చెందకుండా నిలువరించవచ్చని భావించిన ప్రభుత్వం.. గత నెల 28న వ్యాక్సినేషన్ను ప్రారంభించింది. ఇప్పటివరకు ఏకంగా రెండు లక్షలకు చేరువలోకి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేరుకున్నది.
సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల ప్రధానంగా 18-45 లోపు వారు వ్యాక్సిన్ వేయించుకునేందుకు అవకాశం లభించింది. దీంతో ఈ అవకాశాన్ని వీరంతా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆయా విభాగాల్లో పని చేసే వారిలో యువతనే అధికంగా ఉన్నారు. వ్యాక్సినేషన్లో 77.53 శాతం మంది 18-45 సంవత్సరాల మధ్య వయసు వారే ఉండటం విశేషం.
కూరగాయలు, పండ్లు, మాంసం అమ్మేవారితో పాటు హెయిర్ కటింగ్, కిరాణా దుకాణాలు నడిపేవారు ఇలా వీరందరికీ బల్దియా ప్రత్యేకంగా 30 కేంద్రాలను ఏర్పాటు చేయడంతో నగరం నలుమూలల వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఇప్పటివరకు కిరాణా దుకాణం నడిపేవారు, మాంసం, కూరగాయలు, పండ్లు అమ్మేవారే దాదాపు లక్ష మంది వరకు టీకాలు వేయించుకున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేషన్ డీలర్లు, పెట్రోల్ బంక్లో పనిచేసే సిబ్బంది, ఇంటింటీ గ్యాస్ డెలివరీ చేసే వారు సుమారు 5,777 మందిని గుర్తించగా… ఇప్పటివరకు 4,551 మందికి టీకాలు వేశారు.
గ్రేటర్ పరిధిలో డ్రైవర్లు సుమారు 2.50 లక్షల మంది ఉంటారని అంచనా. వీరికి ఈ నెల 3న వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందుకుగాను పది కేంద్రాలను ఏర్పాటు చేసి, ఒక్కో కేంద్రంలో వెయ్యి మందికి చొప్పున వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. సుమారు 14వేల మంది టీకాలు వేయించుకున్నట్లు అధికారులు తెలిపారు.