ఇంటింటికీ ప్రత్యేక బృందాలు
తొలిరోజు 1487 మంది గుర్తింపు
1400 మందికి అక్కడికక్కడే మందులు
కొవిడ్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మహా నగరంలో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన 641 బృందాలు ఇంటింటికీ తిరిగి జ్వరం, కొవిడ్ లక్షణాలున్న వారి వివరాలపై సర్వేను ముమ్మరంగా చేపడుతున్నారు. ఒక్కో బృందంలో ఒక ఏఎంఎం, ఆశా వర్కర్, జీహెచ్ఎంసీ ఎంటమాలజీ వర్కర్తో కూడిన సభ్యులు ఇంటింటికీ తిరిగి థర్మోస్కానర్తో ఫీవర్ సర్వేను చేపడుతున్నారు. మంగళవారం ఒక్కరోజే 40 వేల ఇళ్లల్లో సర్వేను చేపట్టారు. 1487 మంది జర్వంతో ఉన్నట్లు గుర్తించారు. ఈ జ్వరంతో బాధపడుతున్న 1487 మందిలో 1400 మందికి వెంటనే కొవిడ్ మందుల కిట్లను అందజేశారు. కాగా, ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే వారికి వెంటనే మందులు అందజేయడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జ్వరం తీవ్రతను బట్టి ఐసోలేషన్లో ఉండటం, ఒకవేళ ఐసోలేషన్ సౌకర్యం లేకపోతే సమీపంలో గుర్తించిన ఐసోలేషన్ కేంద్రాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఫీవర్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎంటమాలజి సిబ్బంది యాంటీ లార్వా ద్రావకాన్ని పిచికారి చేస్తున్నారు.