హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 28(నమస్తే తెలంగాణ): కరోనా నుంచి కోలుకున్న వారిని నిద్రలేమి సమస్య వెంటాడుతున్నది. కరోనా అనంతరం కలుగే పలు ఆరోగ్య సమస్యలతోపాటు నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఒకవేళ నిద్రపట్టినా తరచుగా మెలకువ వస్తున్నదని పలువురు పేర్కొంటున్నారు. కాగా మానసిక ఒత్తిడి వల్లనే నిద్రలేమి సమస్య ఉత్పన్నమవుతుంది తప్ప ఇతర కారణాలేమీ లేవని వైద్య నిపుణులు అంటున్నారు. రోజుకు 7-8 గంటల పాటు నిద్రపోవాలని, లేదా అనవసరం అనారోగ్యం కొని తెచ్చుకున్నవారవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్ర పట్టడంలేదని మందులు వేసుకోవడం శ్రేయస్కరం కాదని చెప్తున్నారు. ఉల్లాసంగా ఉండటంతోపాటు యోగా, వ్యాయామంతో ఈ సమస్యను అధిగమించవచ్చని సూచిస్తున్నారు.
సెకండ్ వేవ్లో వైరస్వల్లనే కాకుండా కోలుకున్న తరువాత కూడా బాధితులను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. వీటిలో నిద్రలేమితో బాధపడేవారి సంఖ్య పెరుగుతున్నదని వైద్యులు తెలిపారు. మానసిక ఒత్తిడి వల్లనే ఈ సమస్య తలెత్తుతున్నట్టు చెప్పారు. వాస్తవానికి ఇది ఆరోగ్య సమస్య కాదని, మానసిక సమస్య అయినందున ఎలాంటి మందులు వాడకపోవడమే మంచిదని అంటున్నారు. ఒకవేళ సమస్య జఠిలంగా ఉంటే మాత్రమే వైద్యుడిని సంప్రదించి… వాళ్లు సూచిస్తేనే మందులు వాడాలని చెప్తున్నారు. రోజూ యోగా లేదా వ్యాయామం చేయడంతో పాటు సంగీతం వినడం, పుస్తక పఠనం వంటి వ్యాపకాలతో మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు. పోస్టు కొవిడ్లో 2-4 వారాలు మాత్రమే ఈ సమస్య ఉండే అవకాశం ఉందని చెప్పారు.