కరోనా మొదటి దశకు, రెండోదశ వైరస్లో చాలా మార్పులున్నాయని, శరీరంలో ప్రవేశించిన వైరస్ ఊపిరితిత్తుల్లో చేరితే వారంరోజుల్లో తీవ్రరూపం దాల్చుతుందని గాంధీ దవాఖాన పల్మనాలజీ నిఫుణుడు డాక్టర్ కృష్ణమూర్తి వెల్లడించారు. రెండోదశ కరోనా అన్ని వయసుల వారిని పట్టి పీడిస్తున్నదని, నలుగురిలో కలువకపోడమే చాలా ఉత్తమమని సూచించారు.
అందరూ వ్యాక్సిన్ వేసుకోగలిగితే మూడోదశ కరోనా వ్యాప్తి ప్రభావం తక్కువగా, ప్రమాదరహితంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. జ్వరం, తలనొప్పి, దగ్గు వంటివి వస్తే ఆలస్యం చేయకుండా కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాసలో వేగం పెరగడం వంటివి గమనిస్తే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి, శ్వాస సంబంధిత అంశాలపై పలువురిలో నెలకొన్న అనుమానాలను ఆయన నివృత్తి చేశారు.