సిటీబ్యూరో, జూన్ 23 ( నమస్తే తెలంగాణ ): లాక్డౌన్ ఎత్తివేయడంతో జనాల రద్దీ పెరిగింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసింది. అయితే దీనిని కొందరు నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు. స్వీయ జాగ్రత్తలకు పాతరేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే మళ్లీ కరోనా కేసులు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. లాక్డౌన్లో ఎలాగైతే కట్టుదిట్టమైన నిబంధనలు పాటించామో.. ఇప్పుడు కూడా ఎవరికీ వారు స్వీయ జాగ్రత్తలు పాటించాలి. నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలే కొవిడ్ థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లాక్డౌన్లు విధించకుండా సుహృద్భావ పరిస్థితులు నెలకొనాలంటే ప్రజలందరూ స్వీయ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మన చుట్టూనే వైరస్ వాహకాలు ఉన్నాయన్న విషయం మరువొద్దు. నిర్లక్ష్యం చేస్తే కరోనా ఆవహించే ప్రమాదం ఉంది. మనం రోజు ఉపయోగించే వస్తువులు, తాకే ప్రదేశాలు ఎంత వరకు పరిశుభ్రంగా ఉన్నాయో పరిశీలించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మనం తరచూ కలుసుకునే వ్యక్తుల ఆరోగ్యంపై ఆరా తీయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా రిస్క్ నుంచి బయటపడటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
లాక్డౌన్ ఎత్తివేయడంతో కార్యాలయాలు, పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. ఇక ఉద్యోగులు ఆఫీసులకు వెళ్తున్నారు. అయితే కార్యాలయాల్లోని కొన్ని వస్తువులతో జాగ్రత్తగా ఉండాలి. వాటితో వైరస్ సోకే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా కుర్చీలు, మౌస్, మౌస్ ప్యాడ్స్, ఫోన్స్, స్కానర్స్, ప్రింటర్స్, స్టేషనరీ, టీ, కాఫీ మెషన్స్, తలుపులు, లైట్ స్వీచెస్, ఎలివేటర్ బటన్స్, టేబుల్ తదితర వస్తువులు వైరస్ వాహకులుగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పర్సులు, బ్యాగ్స్, కండ్లజోడు, షూస్, మొబైల్స్, గడియారం, జ్యువెల్లరీ, స్మార్ట్ వాచెస్ తదితర యాక్ససరీలపై కూడా వైరస్ ఉండే అవకాశం ఉంటుంది. వాటిని తరచూ ఉపయోగిస్తూ ఉంటాం. అవి లేనిది బయటకు వెళ్లలేం. కావున వాటిని వాడే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి.
మొదటగా మాస్క్లను ధరించకుండా బయటకు వెళ్లకూడదు. మాస్క్ ముట్టుకునే మందు ఉపయోగించాక పడేసిన అనంతరం కచ్చితంగా శానిటైజర్తో చేతులు పరిశుభ్రం చేసుకోవాలి. తిరిగి ఉపయోగించుకునే మాస్క్లను కచ్చితంగా ఉతుక్కోవాలి.
ప్రయాణం చేసేటప్పుడు శానిటైజర్ను వెంట ఉంచుకోవాలి. పబ్లిక్ ప్రాంతాల్లో ఏవైనా వస్తువులను తాకే సమయంలో శానిటైజర్ ఉపయోగపడుతుంది.
కండ్లజోళ్లు.. పాదరక్షలను తరచూ పరిశుభ్రం చేసుకోవాలి.
ఉతకడానికి వీలుగా ఉన్న బ్యాగులను ఉపయోగించండి.
డోర్ బెల్స్, కిటికీ తలుపులు, టీవీ, ఏసీ రిమోట్, తాళం చెవి, బెడ్షీట్స్ (బ్లాంకెట్స్), బెడ్ కవర్స్, పిల్లో కవర్లు, టవల్స్, రగ్గులు, కార్పెట్లు తదితర వస్తువులపై వైరస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటిని పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఇంటిల్లిపాది అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.
ఇంట్లో ఏ వస్తువును ముట్టుకున్నా చేతులను సబ్బుతో కడుక్కోవడం మంచిది.
ఇంటికి వెళ్లగానే ధరించిన బట్టలను వాషింగ్ చేయాలి. పాదరక్షలను బయటే విడవాలి. ఇన్ఫెక్షన్ ఉంటుందనుకున్న ఏ వస్తువునైనా పరిశుభ్రం చేయనిది.. ఇంటిలోకి తీసుకెళ్లకూడదు. ఇంట్లోని గదులన్నింటికి గాలి వీచేలా ఏర్పాటు చేసుకోవాలి. కిటికీలు లేకుండా మూసి ఉన్న గదుల్లో ఎక్కువ సమయం ఉంటే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.
లాక్డౌన్ సడలింపుతో ప్రజా రవాణా పూర్తిస్థాయిలో షురూ అయింది. ఆటోలు, ట్యాక్సీలు, బస్సులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. కూర్చొనే సీట్లు, మోచేతులు పెట్టుకోవడానికి వీలుగా ఉన్న ఆర్మ్రెస్ట్స్, మెట్లు ఎక్కేటప్పుడు చేతులతో పట్టుకునే.. హ్యాండ్రాయిల్స్ తదితర వాటితో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. చాలామంది వాటిని ఎక్కువగా ఉపయోగిస్తుండటం ప్రమాదరకరం. టాయిలెట్ తలుపులు, టాయిలెట్ సీటు, ఫ్లషింగ్ బటన్, టాయిలెట్ పేపర్, టవల్స్ తదితర సామగ్రితో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది.ఏ వస్తువును తాకినా చేతులను పరిశుభ్రం చేసుకోకుండా కండ్లు, ముక్కు, నోరును ముట్టుకోకూడదు. శానిటైజర్ను వెంట తీసుకెళ్లడం మరిచిపోవద్దు.