కార్వాన్, మే 9 : కరోనా ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతున్నది. తీరని వ్యధను మిగిలిస్తున్నది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి.. కొడుకును చూసుకొని మురిసిపోయింది. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలువలేదు. శిశువు పుట్టిన రెండ్రోజులకే కొవిడ్ సోకింది. 15 రోజులు మృత్యువుతో పోరాడి.. తన బడ్డకు అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ ఏకైక కూతురు భవాని (28) ఏప్రిల్ 23న ఓ ప్రైవేటు దవాఖానలో భవాని మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవానికి ముందు కరోనా పరీక్షలు నిర్వహించగా, నెగెటివ్ వచ్చింది. దీంతో వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు.
మళ్లీ కొవిడ్ టెస్టు చేస్తే.. పాజిటివ్ రిపోర్టు వచ్చింది. హోం క్వారంటైన్లో ఉండొచ్చనే ఉద్దేశంతో 25న డిశార్జి అయి ఇంటికి చేరింది. అయితే స్వల్పంగా శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తుతుండటంతో 27న తిరిగి అదే దవాఖానలో చేరింది. 15 రోజలుగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయింది. కాగా, కార్పొరేటర్ దేవర కరుణాకర్ కుమార్తె భవాని మృతితో గుడిమల్కాపూర్లో విషాదచాయలు అలముకున్నాయి. భవాని మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.