కంటోన్మెంట్లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
మాస్క్ ఉందన్న ధీమాలో భౌతికదూరాన్ని విస్మరిస్తున్న జనం
కంటోన్మెంట్, మార్చి 28 : కంటోన్మెంట్ పరిధిలో కరోనా వైరస్ మరోసారి జడలు విప్పుతున్నది. ఇప్పటి వరకు హాస్టల్లోని విద్యార్థులతో పాటు కూలీ పనులు చేసుకునే వారు సైతం ఈ మహమ్మారి భారిన పడుతున్నారు. ఈ క్రమంలో కరోనా భయం తో ఎవరు ఎటు వెళ్లాలన్నా హడలిపోతున్నారు. అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే వారికీ కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. పాజిటివ్ వస్తే తమ నివాసంలోనే హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. కంటోన్మెంట్లోని పలు అపార్టుమెంట్లలోనూ కరోనా వ్యాప్తి చెందుతున్నట్టు సమాచారం. కంటోన్మెంట్ పరిధిలో ఇప్పటి లవరకు వందకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కంటోన్మెంట్లో కరోనా ప్రారంభ సమయంలో ప్రజలు ఎంత జాగ్రత్తగా వ్యవహరించారో ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ లో అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. మాస్కు లు పెట్టుకున్నామన్న ధీమా తో భౌతికదూరం పాటించడం లేదు. వ్యాపార సముదాయా లు, దుకాణాల వద్ద ఎవరూ భౌతికదూరం పాటించడం లేదు. నేతల పర్యటనల్లో వారికి చేరువ కావాలనే ఆత్రంలో ఒకరిమీద ఒకరు పడుతూ భౌతికదూరం నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు, అధికారులు, మీడియా ప్రతినిధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కంటోన్మెంట్లోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ కిక్కిరిసి ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పక్కపక్కనే వాహనాలు ఉండాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలోనూ కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఇకనైనా ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.