సిటీబ్యూరో, మే 28(నమస్తే తెలంగాణ): సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పడుతున్నది. ప్రభుత్వం తీసుకుంటున్న సమర్థవంతమైన చర్యలతో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పడిపోతున్నది. అదే సమయంలో రికవరీ రేటూ రెట్టింపవుతున్నది. ప్రైవేటు, ప్రభుత్వ దవాఖానల్లో మొన్నటి వరకు నిండుగా ఉన్న పడకలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా 30 నుంచి 35 శాతం పాజిటివిటీ తగ్గినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మరో వారం పదిరోజుల్లో కేసుల సంఖ్య 60నుంచి 70శాతానికి పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. జూన్ చివరినాటికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా లాక్డౌన్తో వైరస్ చైన్ బ్రేక్ అయి.. సత్ఫలితాలు వస్తున్నట్లు పేర్కొంటున్నారు.
కరోనా జనరల్, ఐసొలేషన్ వార్డులు సగానికి పైగా ఖాళీ అవుతుండడం వైరస్ తగ్గుముఖం పడుతుందనేందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 8172 పడకలు ఉంటే.. వాటిలో 5063 ఖాళీగా ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి వెల్లడించారు. మేడ్చల్ జిల్లాలో మొత్తం 5,488 పడకలకు 3696 ఖాళీగా ఉన్నాయి. జిల్లా పరిధిలో మొత్తం 53 పడకలు ప్రభుత్వ పరిధిలో ఉండగా, వాటిలో 38, ప్రైవేటువి 5,435 ఉంటే.. అందులో 3658 ఖాళీగా ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 11,649 బెడ్లకు 4689లు ఖాళీగా ఉన్నట్లు ్ల వైద్యాధికారి డాక్టర్ వెంకటి వెల్లడించారు.
మొన్నటి వరకు కార్పొరేట్ దవాఖానల్లో ఆక్సిజన్, వెంటిలెటర్ బెడ్ల కోసం రోజుల తరబడి వెయిటింగ్ ఉండేది. ప్రస్తుతం నిరీక్షణ సమయం తగ్గింది. 12 నుంచి 24 గంటల్లోనే బెడ్లు లభిస్తున్నాయని వైద్యవర్గాలు తెలిపాయి. కార్పొరేట్ దవాఖానల్లో కరోనా జనరల్ పడకలు 30 నుంచి 40శాతం ఖాళీ ఉండగా, ఆక్సిజన్ బెడ్లు 5 నుంచి 10శాతం వరకు లభ్యత ఉన్నట్లు వెల్లడించారు. అయితే వెంటిలెటర్ పడకలు తక్కువగా ఉండటం వల్ల వీటికోసం కొంత నిరీక్షణ తప్పడం లేదంటున్నారు.