సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వారం రోజుల క్రితం వెయ్యి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం వందల్లోకి చేరింది. లాక్డౌన్తో పాటు చైన్బ్రేక్ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాజిటివ్ కేసులు తగ్గుతున్నట్లు వైద్యారోగ్య శాఖాధికారులు తెలిపారు. గతంలో కంటే ప్రస్తుతం ప్రజల్లో అవగాహన పెరిగిందని, జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ప్రజలు కూడా అప్రమత్తంగానే ఉంటున్నా కొంత మంది నిర్లక్ష్యం ఇతరులకు ఇబ్బందికరంగా మారుతున్నదని వైద్యులు వాపోతున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పరీక్షలు జరపడం, జ్వర సర్వే ద్వారా లక్షణాలున్న వారికి ఇంటి వద్దే మందులు పంపిణీ చేయడం, సకాలంలో వైరస్ బాధితులను గుర్తించి చికిత్స అందిస్తుండడంతో రోగులు త్వరగా కోలుకుని రికవరీ రేటు సైతం 80శాతానికి పైగా ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. వైరస్ బాధితులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తుండడంతో వైరస్ చైన్ బ్రేక్ అయ్యి కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.