కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ స్థాయిలోనే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఒకవైపు మహమ్మారిని కట్టడి చేస్తూనే.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పడకల సంఖ్యను రెట్టింపు చేసింది. ప్రస్తుతం సర్కారు దవాఖానల్లో 60 శాతానికి పైగా కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన బెడ్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, వైరస్ నిర్ధారణ జరిగిన వెంటనే లక్షణాలు లేని వారు, స్వల్పంగా ఉంటే ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలు లేదా హోం ఐసొలేషన్కు సిఫారసు చేస్తుండగా, తీవ్ర లక్షణాలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులను గాంధీ, ఎర్రగడ్డ టీబీ హాస్పిటల్, గచ్చిబౌలి టిమ్స్ వంటి దవాఖానలకు తరలిస్తున్నారు.
వైద్య, ఆరోగ్యశాఖ గాంధీ దవాఖానలో ఇప్పటికే కరోనా పడకల సంఖ్యను 200 నుంచి 500కు పెంచింది. ఇందులో 300 ఐసీయూ, 200 సాధారణ కరోనా వార్డుకు కేటాయించారు. మరో 300 పడకలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 500 పడకల్లో కేవలం 230 మాత్రమే నిండగా, 270 ఖాళీగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎర్రగడ్డ ఛాతి దవాఖానలో మొత్తం 142 కరోనా పడకలు ఏర్పాటు చేయగా, అందులో 18 ఐసీయూ వార్డుకు కేటాయించగా, ప్రస్తుతం 55 పడకలు రోగులతో నిండాయి. మిగిలిన 87 ఖాళీగా ఉన్నాయి. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద దవాఖానలో ఉన్న 220 పడకలన్నీ ఖాళీగానే ఉన్నాయి. మొత్తంగా ప్రభుత్వ దవాఖానల్లో 60 శాతానికి పైగా పడకలు ఖాళీగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కింగ్కోఠి దవాఖానలో మొత్తం 350 పడకలను కొవిడ్ రోగులకు కేటాయించగా, అందులో 200 ఐసీయూ, 150 సాధారణ కొవిడ్ వార్డుకు కేటాయించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గ్రేటర్ పరిధిలో మొత్తం తొమ్మిది కరోనా కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. గాంధీ, కింగ్కోఠి, టిమ్స్, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద దవాఖాన, అమీర్పేట ప్రకృతి చికిత్సాలయం, చార్మినార్ నిజామియా, సరోజినీదేవి కంటి దవాఖాన, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి తదితర దవాఖానల్లో కరోనా వార్డులను ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు.
కరోనా నియమాలు పాటిస్తే వైరస్ను జయించినట్లే. వైరస్ వ్యాప్తి ఉధృతంగానే ఉంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. దీనిని దృష్టిలో పెట్టుకుని గాంధీలో తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే 500 పడకలను ఏర్పాటు చేశాం. మరో 300 పడకలు అందుబాటులోకి తీసుకువస్తాం. ప్రజలు ఎలాంటి అపోహలు, భయాందోళనకు గురికావాల్సిన పనిలేదు. చేయాల్సిందల్లా ముఖానికి మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడమే. – డాక్టర్ రాజారావు, గాంధీ సూపరింటెండెంట్