రానున్న మూడు రోజుల పాటు నగరంలో పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఆదేశించిన నేపథ్యంలో నగరంలో ఆదివారం పెద్ద ఎత్తున పారిశుధ్య డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని 636 ప్రాంతాలలో విస్తృతంగా సోడియం హైపోక్లోరైట్ ద్రావకాన్ని చల్లారు. ఎంటమాలజి బృందాలు దాదాపు 900 లీటర్ల ద్రావకాన్ని, 840 స్ప్రేయర్లు, ఏడు జెట్ మిషన్లు, 63 పెద్ద ఫాగింగ్ మిషన్లు, 302 చిన్న ఫాగింగ్ మిషన్లతో 16 వేలకు పైగా ఆవాసాలలో స్ప్రె చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా కొవిడ్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాలలో రోజుకు రెండు సార్లు సోడియం హైపోక్లోరైట్ ద్రావకం స్ప్రే చేపట్టారు. ప్రతి జోన్లో మూడువేల లీటర్ల సోడియం హైపోక్లోరైట్ ద్రావకాన్ని అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెప్పారు. జోనల్, సర్కిల్ స్థాయిలో ఎమర్జెన్సీ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానలు, ఆలయాలు, మసీదులు , ప్రార్థనా మందిరాలు, మార్కెట్లు ఇతర రద్దీ ప్రాంతాలలో స్ప్రేయింగ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.