మల్కాజిగిరి : కొవిడ్ మహమ్మారి ఏడాది కాలంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. తగ్గినట్లే తగ్గి అందరూ మామూలు పరిస్థితికి చేరుకుంటుందన్న దశలోనే సెకండ్ వేవ్ మళ్లీ విరుచుకుపడుతుంది. నిర్లక్ష్యం చేస్తున్న జనం.. కొవిడ్ నిబంధనలు సైతం పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తున్నారు. నెల రోజులుగా మల్కాజిగిరిలో ఈ మహమ్మారి ప్రజలను వణికిస్తోంది. రోజూ పరీక్షలు చేయించుకుంటున్న వంద మందిలో 30 నుంచి 40 మంది వరకు పాజిటివ్ బారిన పడుతున్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ దవాఖానతో పాటు నేరేడ్మెట్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం మొత్తం ఐదు కేంద్రాల్లోనూ నిత్యం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక మార్చి నెలలోనే ఇప్పటి వరకు మల్కాజిగిరిలోని వివిధ సెంటర్లలో నిర్వహించిన 5,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 400 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా అధికార వర్గాల లెక్కలు చెబుతున్నాయి.
పాజిటివ్ వచ్చిన వారు ఇండ్లకే పరిమితం కాకపోవడంతో వైరస్ను విస్తరింపజేస్తున్నారు. ఇలాంటి వారితోనే వైరస్ సోకే ప్రమాదం ఉందని పలువురు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ తర్వాత విద్యాలయాలు కూడా నిబంధనలు పాటిస్తూ పనిచేస్తున్నాయి. అయినా.. కొంతమంది వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం వల్ల అక్కడక్కడ విద్యార్థులు కూడా కరోనా బారినపడుతున్నారన్న వార్తలు రావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రతిరోజు ఉదయం నిద్రలేచి ప్రాణాయామం చేయాలి. నిమ్మరసం వేడిచేసుకుని తాగాలి. సీ విటామిన్ ట్యాబ్లెట్లు వాడాలి. వేడి పాలలో కాస్తంత పసుపు వేసుకుని తాగాలి. ప్రతిరోజు కనీసం రెండు సార్లయినా వేడినీటితో ఆవిరి పట్టుకోవాలి. వేడి నీటితో చేసుకున్న ఆయుర్వేద టీ తాగాలి. యోగా చేయాలి. బలం పెంచే మంచి ఔషధాలు వాడాలి.- డాక్టర్ ఆర్.శ్రీనివాస్ ప్రభుత్వ ఆయూష్ వైద్యులు
నిర్లక్ష్యం చేస్తే ముప్పే
పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. నిబంధనలు పాటించక పోతే చాలా ప్రమాదం. జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కు మాత్రమే శ్రీరామరక్ష. భౌతిక దూరం తప్పని సరి పాటించాలి. శానిటేషన్ చేసుకోవాలి. కొవిడ్ టీకాలు తీసుకున్న వారు సైతం అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో టెస్టుల సంఖ్యను పెంచాం. టీకాల సంఖ్యను కూడా పెంచాం. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.- డాక్టర్ రాజు ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ మల్కాజిగిరి