మియాపూర్, మే 3 : కరోనా వైరస్ లక్షణాలు కలిగి ఉండి సరిగా గుర్తించలేకపోతుండటం.. భయాందోళనలతో వైద్యానికి ముందుకు రాకపోతుండటం లాంటి పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో శేరిలింగంపల్లి వెస్ట్జోన్ పరిధిలోని శేరిలింగంపల్లి చందానగర్ జంట సర్కిళ్లలో ఇంటింటి సర్వేకు అధికారులు శ్రీకారం చుడుతున్నారు. బల్దియా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో జంట సర్కిళ్లలో మంగళవారం నుంచి ఫీవర్ సర్వేను పూర్తి స్థాయిలో చేపట్టబోతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ జీహెచ్ఎంసీ సంయుక్తంగా ఈ సర్వేను చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. జంట సర్కిళ్ల పరిధిలోని స్లమ్ ఏరియాల్లో ప్రత్యేక బృందం ఇంటింటి సర్వేను చేపట్టి జ్వరం సహా ఇతర లక్షాణాలున్న వారి వివరాలను నమోదు చేయనున్నారు. ఏరోజుకారోజు ఈ వివరాలను జీహెచ్ఎంసీ సహా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు నివేదిస్తారు.
ఈ సందర్భంగా సర్కిళ్ల పరిధిలో అందుబాటులో ఉండే ఐసోలేషన్ కేంద్రాలు, కొవిడ్ కేర్ సెంటర్లపైనా క్షేత్రస్థాయిలో సిబ్బంది ప్రజలకు తెలియపరుస్తారు. ప్రధానంగా లక్షణాలుండి ముందుకు రానివారిని గుర్తించి తక్షణ వైద్య సేవలను అందించటం ద్వారా మరింత మందికి వ్యాప్తి చెందకుండా నిరోధించాలన్నది సర్వే లక్ష్యంగా అధికారులు పేర్కొంటున్నారు. ఆయా సర్కిళ్ల పరిధిలో ఇప్పటికే ఆక్సిజన్ ఐసోలేషన్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తుండగా.. వాటిలో ఉచితంగా ఆక్సిజన్ సేవలను పొందే వెసులుబాటుపైనా ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
చందానగర్, శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలో మంగళవారం నుంచి సిబ్బంది క్షేత్రస్థాయిలో ఫీవర్ సర్వేను పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నాగళ్ల రవికిరణ్ నేతృత్వంలో సోమవారం జోనల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఒక్కో బృందంలో నలుగురు సభ్యుల చొప్పున సర్కిల్కు నాలుగు బృందాలు, జంట సర్కిళ్లలో 8 బృందాలు ఈ ఫీవర్ సర్వేలో భాగస్వామ్యం కానున్నాయి. ఈ బృందంలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఆశ వర్కర్స్, ఏఎన్ఎం, జీహెచ్ఎంసీ నుంచి ఎంటమాలజీకి చెందిన ఇద్దరు సభ్యులుంటారు. ఇంటింటి సర్వేలో సేకరించాల్సిన ఫార్మాట్లను ఇప్పటికే సిబ్బందికి అందజేశారు. జంట సర్కిళ్ల పరిధిలో శేరిలింగంపల్లి, రాయదుర్గం, హఫీజ్పేట్ యూపీహెచ్సీలున్నాయి. ఇప్పటికే వీటి పరిధిలో గుర్తించిన స్లమ్ ఏరియాలుండగా.. ప్రత్యేక బృందాలు ఆ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టి వివరాలను సేకరిస్తాయి.