సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ)/ హయత్నగర్ / మాదాపూర్ : నగరంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మొన్నటి వరకు మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ర్టాల్లోనే వైరస్ ఉద్ధృతి ఉండగా గడిచిన మూడు, నాలుగు రోజులుగా తెలంగాణలో సైతం వైరస్ వ్యాప్తి చెందుతున్నది. దీంతో రాష్ట్ర సరిహద్దులతోపాటు గ్రేటర్ సరిహద్దులపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ని ఘా పెట్టింది. ముఖ్యంగా పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి వచ్చేవారు కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, భైంసా తదితర ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో సైతం కేంద్రాలను ఏర్పాటు చేసి పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చేవారికి కరోనా పరీక్షలు చేపడుతున్నారు.
పరీక్షల సంఖ్య పెంపు
కరోనా కేసుల ఉద్ధృతితో గ్రేటర్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచినట్లు హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి వెల్లడించారు. నగరంలోని ప్రతి పీహెచ్సీలో పరీక్షలు జరుపుతున్నామని, వాటితోపాటు ఉస్మానియా, గాంధీ మెడికల్ కళాశాల, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, అమీర్పేట ప్రకృతి చికిత్సాలయం తదితర కేంద్రాల్లో అదనంగా పరీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు.
రంగారెడ్డి పరిధిలో 60మంది విద్యార్థులకు కరోనా
రంగారెడ్డి జిల్లా పరిధిలోని హయత్నగర్ గురుకుల విద్యాలయంలో 38 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరితో పాటు శేరిలింగంపల్లిలోని గోకుల్ఫ్లాట్స్ ప్రాంతంలో ఉన్న మైనార్టీ సంక్షేమ హాస్టల్లో 22మంది విద్యార్థులు కరోనా బారినపడినట్లు అధికారులు తెలిపారు.
పెరుగుతున్న కొవిడ్ కేసులు
బోయిన్పల్లి గిరిజన బాలుర హాస్టల్లో 45మందికి కరోనా
కంటోన్మెంట్, మార్చి 20: కంటోన్మెంట్ పరిధిలో కొన్ని రోజులుగా కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు కరోనా వదిలి పెట్టడం లేదు. నిత్యం 10 నుంచి 15 వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కంటోన్మెంట్ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో 6 నుంచి 10 వరకు తరగతులను నిర్వహిస్తున్నారు. కాగా శనివారం బోయిన్పల్లిలోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతిగృహంలో 40 మంది విద్యార్థులకు ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలింది. ఓ విద్యార్థికి నీరసంతోపాటు ఆయాసం ఎక్కువగా ఉండటంతో గాంధీ దవాఖానకు తరలించినట్లు వసతిగృహ నిర్వాహకులు తెలిపారు. కరోనా కలకలం కారణంగా శనివారం మడ్ఫోర్ట్ ప్రభుత్వ పాఠశాలో శానిటైజేషన్ చేశారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇద్దరికి కొవిడ్
వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 20 : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వారిని హోం క్వారంటైన్కు తరలించినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీనియర్ డాక్టర్ సంతోష్కుమార్ తెలిపారు. దిగులు చెందొద్దని, వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు సూచించారు. దవాఖానలో మందుల కొరత లేదని, నిరంతరం విద్యార్థులను పరీక్షిస్తున్నామని వివరించారు.