కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్లో వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్ని అవలంభిస్తున్నది. రోగులను గుర్తించేందుకు కరోనా నిర్ధారణ పరీక్షలను ముమ్మరం చేసింది. గ్రేటర్లోని అన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా దవాఖానలతో పాటు ప్రత్యేక కేంద్రాలను సైతం ఏర్పాటు చేసి ప్రతిరోజు 10నుంచి 15వేల మందికి పరీక్షలు జరుపుతున్నారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా బస్తీలు, కాలనీల వద్దకే మొబైల్ టెస్టింగ్ వాహనాలను పంపుతూ వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారు. వైరస్ నిర్ధారణ జరిగిన రోగులను హోమ్ క్వారంటైన్ లేదా దవాఖానల్లోని ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. తీవ్ర లక్షణాలున్న రోగులను గాంధీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రోగులను తరలించేందుకు ప్రత్యేక 108అంబులెన్స్ వాహనాలను సైతం అందుబాటులో ఉంచారు.
గాంధీ దవాఖానలో 300ఐసోలేషన్ పడకలు, 100 ఐసీయూ పడకలు, కింగ్కోఠిలో 250ఐసోలేషన్ పడకలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఎర్రగడ్డ చాతి దవాఖానలో 124పడకలు, ప్రభుత్వ ఆయుర్వేద దవాఖానలో 220పడకలతో కొవిడ్ వార్డులను ఏర్పాటు చేశారు. ఈ పడకలన్నింటికీ ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. అంతేకాకుండా ప్రైవేటు దవాఖానల్లో 50శాతం పడకలను కరోనా రోగులకు కేటాయించాల్సిందిగా ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. క్వారంటైన్లో ఉన్న స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న రోగులకు మెడికల్ కిట్స్ అందజేస్తున్నారు. అంతేకాకుండా గ్రేటర్ వ్యాప్తంగా 310కేంద్రాలలో టీకా వేస్తున్నారు. అనుమానిత లక్షణాలున్నవారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.