కరోనా వైరస్తో కేవలం దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు మాత్రమే కాదు.., ఆ ప్రభావం మెదడు, నరాలపైనా పడుతున్నదని ప్రముఖ న్యూరో సర్జన్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రంగనాథమ్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ ప్రభావం మెదడుపై పడటం వల్ల క్రమంగా జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుందన్నారు. ఉదయం లేవగానే ఏ పనీ చేయలేకపోవడం, ఏదీ గుర్తుండక పోవడం, చికాకుగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. అలాగే నిద్ర లేకపోవడంతో పాటు మానసిక సమస్యలు కూడా వస్తున్నాయని వెల్లడించారు. కంటిచూపు కూడా పోయే ప్రమాదం ఉందని.. వీటిని ముందుగానే గుర్తించి కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథమ్తో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. వివరాలు ఆయన మాటల్లోనే…
కరోనా సోకిన వారిలో మానసికమైన మార్పులు వస్తున్నాయి. త్వరగా డిప్రెషన్కు గురవుతున్నారు.
మానసిక ధైర్యం సన్నగిల్లుతుంది. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహించుకుంటారు.
అలాగే నిద్ర ఉండదు. ఈ క్రమంలో మానసిక వైద్యులను సంప్రదించాలి.
ప్రస్తుతం మహారాష్ట్రంలోని 40శాతం జనాభాలో యాంటీబాడీస్ తయారయ్యాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా అంతానికి ఇది శుభపరిణామంగా భావిస్తున్నారు. మహారాష్ట్రంలో మే రెండో వారంలోగా కరోనా కేసులు పూర్తిగా తగ్గే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తుంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని యాంటీబాడీస్ పెంచుకోవాలి.
కరోనా బారిన పడి వెంటిలేషన్పై ఉన్న కొందరికి స్టెరాయిడ్స్ ఎక్కిస్తున్నారు. దీన్ని కంటిలో ఉండే సన్నని నరాలు తట్టుకోలేవు. దీంతో కంటి చూపు మందగిస్తుంది. పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా ఉన్నది. గత నాలుగు రోజుల కిందట నగరంలోని ఒక ప్రైవేటు దవాఖానలో ఈ విషయం బయటపడింది. అయితే కొంత మందిలో కనురెప్పలపై బొబ్బలు, విపరీతమైన నొప్పి వస్తుందని డాక్టర్లు గుర్తించారు.