సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్కు చెందిన ఓ మహిళను రూ. 10 లక్షలు మోసగించిన సైబర్ నేరగాడిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్కు తరలించే సమయంలో నిందితుడికి వైద్య పరీక్షలు చేయించగా కొవిడ్ ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు కంగుతిన్నారు. సైబర్ ఠాణాకు వచ్చిన ప్రజలు కూడా ఆందోళనకు గురయ్యారు. సాయంత్రం అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించి ఊపిరి పీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్కు చెందిన ఓ మహిళకు మ్యాట్రీమోనీ పేరుతో సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ వ్యక్తి తాను అమెరికాలో ఉంటానని, స్వస్థలం గుజరాత్ అని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన మహిళ కొన్నాళ్లు చాటింగ్ చేసింది. దీంతో అతడు.. తన భార్య చనిపోయింది.. తాను అమెరికాలో పర్మినెంట్ రెసిడెంట్నని.. అయినా కూడా ఇండియాకు తన మూడేండ్ల కూతురుతో పాటు వచ్చి పెండ్లి చేసుకుంటానని మహిళను నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన బాధిత మహిళ పలు దఫాలుగా రూ. 10 లక్షలు వరకు ఇచ్చింది. అతడు ఇంకా డబ్బు అడగడంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ గంగాధర్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టి, నిందితులు ఢిల్లీకి చెందిన వారని గుర్తించారు.
మహిళను మోసం చేసిన సైబర్ నేరగాడు నైజీరియాకు చెం దిన ఓజా ఎబుసాగా గుర్తించారు. అతడిని గతనెల 31న ఢిల్లీలో అరెస్ట్ చేశారు. బార్బర్ వృత్తి పేరుతో వీసాపై నైజీరియా నుంచి వచ్చి ఢిల్లీలో ఉంటున్నాడు. ఒక పక్క బార్బర్గా పనిచేస్తూ.. మరో పక్క సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ వెళ్లిన సీసీఎస్ పోలీసులు గురువారం అతడిని అరెస్టు చేసి, సోమవారం హైదరాబాద్కు తీసుకువచ్చారు. మంగళవారం చంచల్గూడ జైలుకు తరలించాల్సి ఉండగా, కింగ్ కోఠి దవాఖానలో కొవిడ్ పరీక్షలు చేయించడంతో పాజిటివ్ అని వచ్చింది.
పాజిటివ్ రావడంతో నేరగాడిని తిరిగి ఠాణాకు తీసుకొచ్చారు. కనీసం మాస్కు కూడా ధరించకుండానే సదరు నేరగాడు ఠాణాలో అధికారులతో మాట్లాడి హంగామా చేశాడు. ధర్జాగా ఫోన్లో బాతకాన్ని సాగించడం కనిపించింది. అక్కడుండే సిబ్బంది అతడి వ్యవహారం చూసి ఆందోళనకు గురయ్యారు. ఠాణాకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రజలు, కేసుల దర్యాప్తులో భాగంగా వచ్చే వారు ఈ విషయం తెలుసుకొని ఆందోళనతో వెను తిరిగారు. చివరకు నిందితుడిని సాయంత్రం గాంధీ దవాఖానకు తరలించారు.