“రాంనగర్ ప్రాంతంలో నివసించే రమేశ్కు 26 ఏండ్లు.. ప్రతి రోజు జిమ్కు వెళ్తాడు.. సిక్స్ ప్యాక్ బాడీ.. చూడడానికి బలంగా ఉంటాడు… కరోనా కేవలం బలహీనంగా, అనారోగ్యంగా ఉండే వాళ్లకే వస్తుంది.. నాకెందుకు వస్తుంది, నాది సిక్స్ప్యాక్ బాడీ అంటూ గొప్పలు చెప్పేవాడు. కొవిడ్ నిబంధనలు ఏమాత్రం పాటించేవాడు కాదు. కానీ 10 రోజుల కిందట జలుబు చేసింది. మామూలే అనుకున్నాడు. రాత్రి వరకు జ్వరం. అప్పుడు తేరుకున్న రమేశ్ స్థానికంగా వైద్య పరీక్షలు చేయించుకుంటే కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అంతేకాదు వాళ్ల ఇంట్లో ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా రమేశ్ నిర్లక్ష్యం కారణంగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న రమేశ్ తన నిర్లక్ష్యమే నాకు, నా కుటుంబ సభ్యులకు కొవిడ్ బారిన పడేలా చేసిందని చాలా బాధ పడుతున్నాడు”… ఇలా రమేశ్ ఒక్కడే కాదు చాలా మంది.. బలంగా ఉన్నాం అని మాకెందుకు వస్తుందని బలాదూర్గా.. నిబంధనలు పాటించకుండా తిరుగుతూ కొవిడ్ బారిన పడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వ్యాధిగ్రస్తులకు సంబంధించి తాజాగా (శనివారం) విడుదల చేసిన బులిటెన్లో 21 నుంచి 40 ఏండ్ల లోపు వయసున్న వారే ఎక్కువగా కొవిడ్ బారిన పడుతున్నారని స్పష్టంగా పేర్కొంది. ముఖ్యంగా 21-30 ఏండ్ల వయసున్న యువత 21.6శాతం, 31 నుంచి 40 ఏండ్లలోపు వయసున్న వారు 21.6శాతం మంది కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇందులో 21-30 ఏండ్లలోపు పురుషులు 13.4శాతం, స్త్రీలు 8.2శాతం మంది ఉన్నారు. అలాగే 31-40 ఏండ్లలోపు పురుషులు 14.2శాతం ఉండగా, స్త్రీలు 7.4శాతం మంది ఉన్నారు. మొత్తం కొవిడ్ వ్యాధిగ్రస్తుల్లో పురుషులు 61.5శాతం ఉంటే, స్త్రీలు 38.5శాతం ఉన్నారని, ఇందులో యువకులు 43.2శాతం మంది ఉన్నారని ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే 41నుంచి 51 ఏండ్లలోపు వారు కూడా మొత్తం 17.6శాతం మంది కొవిడ్ బారిన పడ్డారని, ఇందులో పురుషులు 11.0శాతం ఉండగా, 6.5శాతం మంది స్త్రీలున్నారని, అలాగే 51-60 ఏండ్లలోపు వారు 14.5శాతం ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
కొవిడ్-19 సెకండ్ వేవ్లో 100శాతం మంది కొవిడ్ వ్యాధిగ్రస్తుల్లో 43.2శాతం యువత ఉండటం ఆందోళన కలిగించే అంశమని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ భవిష్యత్తులో గుండె, కిడ్నీ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, అసలు ఆ వ్యాధి భారిన పడకుండా ఉండటమే శ్రేయస్కరమని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, అత్యవసర పరిస్థితిల్లో తప్ప.. బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా 6 అడుగుల భౌతికదూరం ఉండేలా చూసుకోవాలని, బయటకు వెళ్లి వచ్చిన వెంటనే సబ్బుతో స్నానం చేయాలని, బయట తిరుగుతున్నప్పడు శానిటైజర్ ఖచ్చితంగా వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు.