బంజారాహిల్స్,ఆగస్టు 22 : నగరంలో పెరుగుతున్న దోమల నివారణకు జీహెచ్ఎంసీ చేపట్టిన చర్యలకు ప్రజలందరూ సహకారం అందించాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి అదివారం 10 నిమిషాలు ఇంటి పరిసరాల్లో నీరు లేకుండా చూసుకోవడం, చెత్తా చెదారం తొలగించే కార్యక్రమాన్ని బంజారాహిల్స్ లోని తన నివాసంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు.
ఇంటి ఆవరణతో పాటు ఇంటి బయట చెత్తాచెదారాన్ని స్వయంగా తొలగించడంతో పాటు నిల్వ ఉన్న నీటిని పారబోశారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారులతో కలిసి దోమల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి కరపత్రాలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ..సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామన్నారు.
అన్ని ప్రాంతాల్లో యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని, పౌరులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. తమ ఇండ్లలో కానీ, ఇంటి పరిసరాల్లో కానీ మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు.
దోమలను ప్రారంభదశలోనే అరికట్టేందుకు పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు, సీనియర్ ఎంటమాలజిస్ట్ దుర్గా ప్రసాద్, అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ రజిత. ఈఎఫ్ఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.