హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులను కల్పించాలనే లక్ష్యంతో జిహెచ్ఎంసి విశేష కృషి చేస్తున్నది. తద్వారా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతున్నది. అలాగే పంజగుట్ట స్మశాన వాటికకు వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తకుండా జిహెచ్ఎంసీ స్టీ్ల్ బ్రిడ్జిని నిర్మించింది.
దీనిని గురువారం (ఎల్లుండి) ఉదయం 10 గంటలకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. పంజగుట్ట గ్రేవ్ యార్డ్ పాత ముఖద్వారాన్ని తొలగించి నూతనంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వలన స్మశానవాటికకు వెళ్లేందుకు ఇబ్బందులు తొలగి పోనున్నాయి.
పాత గేట్ నుంచి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకు వెడల్పు చేసినందున నాగార్జున సర్కిల్ నుంచి కే.బి.అర్ పార్క్ జంక్షన్ కు వెళ్లే వాహనాలు ఎలాంటి ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా నేరుగా వెళ్లవచ్చు.
గ్రేవ్ యార్డ్ వెళ్లేందుకు ప్రజలు ఇబ్బంది తో పాటుగా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవ్వడంతో జిహెచ్ఎంసి శాశ్వత పరిష్కారం చేసేందుకు రూ. 17 కోట్ల రూపాయలను మంజూరు చేసి స్టీల్ బ్రిడ్జి, పాత గేట్ నుంచి హెచ్.టి లైన్ వరకు రోడ్డు విస్తరించడం మూలంగా గతంలో ఏర్పడిన ట్రాఫిక్ సమస్య తీరుతుంది.