అమీర్పేట్: వయోధికుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొవిడ్ కారణంగా గత రెండేండ్లుగా అంతర్జాతీయ వయోధికుల దినోత్సవం జరపుకోలేని పరిస్థితి నెలకొన్న నేపధ్యంలో ఇటీవలే ఎస్ఆర్నగర్ వయోధికుల సంఘం ప్రతినిధులు కౌన్సిల్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.
ఈ వేడుకలకు హాజరు కావాల్సిన మంత్రి తలసాని ప్రభుత్వ కార్యాక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల హాజరుకాలేకపోయారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం కౌన్సిల్ అధ్యక్షులు కాసాని సహదేవ్గౌడ్ ఆధ్వర్యంలో వయోధికుల మండలి ప్రతినిధులు మంత్రి తలసానిని ఆయన నివాసంలో కలుసుకుని జ్ఞాపికను బహుకరించి శాలువతో సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి చేపడుతున్న కార్యాక్రమాలకు తనవంతు పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రధాన కార్యదర్శి డి.అనంతరెడ్డి, కోశాధికారి యాదగిరి, కార్యనిర్వాహక కార్యదర్శి పెరుమాండల లింగమయ్యతో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.