‘నీరు పల్లమెరుగు..’ అన్నది పాత మాట. తెలంగాణలో నదులు ఎత్తుకు పారుతూ బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నాయి. ఎక్కడ నీటి కరువుంటే అక్కడికి వాగులు వంకలు దాటి మిట్టకు చేరుకుంటున్నవి. నెర్రెలు బారిన నేల దాహార్తిని తీరుస్తున్నవి. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించిన గోదావరి జలాల రివర్స్ మళ్లింపు పథకం ఓ చరిత్రాత్మక ఘట్టం. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వదారా హల్దీవాగులోకి.. అక్కడినుంచి 96 కిలోమీటర్ల మేర వాగులు, వంకల గుండా ప్రవహించి నిజాంసాగర్లోకి చేరుకునే గోదావరి జలాలతో కరువుసీమ మెదక్ సస్యశ్యామలం కాబోతున్నది. దీంతో తెలంగాణ నిజాం సాగర్ ఆయకట్టుకు పూర్వ వైభవం రాబోతున్నది. ఎద్దడుగులో జల ఊట.., వాగు ఇసుకలో కట్టిన పిట్టగూడులో ఊరిన నీరు.., చేనుకాడి బండదొనలో దూపతీర్చిన చలువనీరు.., దోసెడు మన్నుతీస్తే జలజల తన్నుకొచ్చిన చెలిమెనీళ్లు.. ఇవన్నీ తాతలు, తండ్రుల నాటి మాటలు. ఒకనాటి తెలంగాణ మాగాణంలోని జలసవ్వడులకు సంకేతాలు. నాడు తెలంగాణ జలభాండాగారంగా ఉండేదనటానికి నిదర్శనాలు. ఇవన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి.
సాధారణంగా జోరువానలకు హల్దీవాగులోని వరదనీరు మంజీరా ఉపనదిని చేరి నిజాంసాగర్ను నింపుతుంది. అక్కడినుంచి ఎస్సారెస్పీని చేరి అనంతరం గోదావరిలో లీనమవుతుంది. ఇది సహజ గమనం. కానీ నేడు సీఎం కేసీఆర్ దీక్షాదక్షత ఫలితంగా గోదావరి నీళ్లు కొత్త నడక నేర్చాయి. కాళేశ్వరం రిజర్వాయర్ నుంచి రోజుకు 1600 క్యూసెక్కుల నీటిని హల్దీవాగులోకి తోడిపోస్తుండటంతో 32 చెక్డ్యాంలు పొంగిపొర్లి అనేక చెరువులు నిండుకుండలవుతాయి. వేల ఎకరాల వరిపొలాలు జీవం పోసుకొని పసిడిపంటను వాగ్దానం చేస్తున్నాయి. గోదావరి జలాలను 600 మీటర్ల ఎత్తుకు మళ్లించటంతో నీటి ఊటను ఎరుగని కరువు ప్రాంతాలన్నీ జలకళను సంతరించుకోనున్నాయి. పాత మెదకు జిల్లా ప్రాంతం మొదలు, వరంగల్ జిల్లాలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు కరువు కోరలనుంచి విముక్తి కాబోతున్నాయి. ఇది స్వీయ పాలన సాధించిన విజయాల్లో తలమానికమైనది.
తెలంగాణ కరువు కాటకాలకు కారణం ప్రకృతి వైపరీత్యాలు కాదు, మానవ తప్పిదాలని ఓ చరిత్రకారుడు చెప్పినది అక్షర సత్యం. సాగునీటి రంగంపై వలసాంధ్ర పాలకులు చూపిన వివక్షతో తెలంగాణ కరువు కాటకాలకు నెలవయింది. బాయి ఒడ్డున నిల్చొని చూస్తే కనిపించనంత లోతులో చెమటోలే మాత్రమే నీటి తడి! మూడొందల ఫీట్ల బోరుబావి వేసినా మూడు బిందెల నీళ్లు రాని ఎద్దడి. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల నిర్లక్ష్యానికి చరమ గీతం పాడి రాష్ట్రసాధన తర్వాత సమస్యల పరిష్కారం దిశగా సాగుతున్న బాటలో నేటి గోదావరి జలాల మళ్లింపు ఓ మైలురాయి. తెలంగాణ బంగారు భవిష్యత్తుకు ఇది సుజల మార్గం.
ఇవి కూడా చదవండి..