-ఎడపల్లి(శక్కర్నగర్), జూలై 7:చిన్న గ్రామం.. జనాభా వేయిలోపే.. నివాసపు ఇండ్లు కేవలం 247.. ఎలాంటి అభివృద్ధికి నోచుకోని ఆ గ్రామానికి ‘పల్లె ప్రగతి’తో మహర్దశ లభించింది. మూడు విడుతలుగా పూర్తయిన పథకం గ్రామాభివృద్ధికి ఊతమిచ్చింది. వరంగా మారిన పల్లె ప్రగతితో సమస్యలు పరిష్కారమయ్యాయి. అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా జరిగాయి. గతంలో లేని సౌకర్యాలు,అభివృద్ధి కార్యక్రమాలు నేడు నిండుగా కనిపిస్తూ గ్రామ రూపురేఖలు మార్చేశాయి.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామం ఒకప్పుడు ముంపుగ్రామంగా పేరొందింది. అలీసాగర్ నుంచి వచ్చే నీరు బ్రాహ్మణపల్లి చెరువులో నిండి ఇండ్లల్లోకి చేరేది. అయితే, పరిస్థితిని గుర్తించిన అధికారులు సమస్య పరిష్కారానికి గ్రామాన్ని వాగు ఎగువ ప్రాంతానికి మార్చారు. నూతనంగా ఇండ్లు నిర్మించుకున్నారు. గ్రామం పాతదే అయినా ఎలాంటి సౌకర్యాలు లేక ఇబ్బందికరంగా మారింది. గతంలో ఎవరైనా మరణిస్తే వాగు పక్కనే అంత్యక్రియలు నిర్వహించేవారు. అలాంటి గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం వన్నె తెచ్చింది. గ్రామంలో అన్ని వసతులు కల్పించుకునేందుకు మంచి అవకాశం లభించింది. మూడు విడుతలుగా నిర్వహించిన పల్లె ప్రగతితో గ్రామంలో మార్పు కనిపిస్తున్నది. కనీస సౌకర్యాలు లేని గ్రామంలో చిన్నా, పెద్ద సమస్యల పరిష్కారానికి దారి చూపింది. ఇందులో భాగంగానే ప్రధాన రోడ్డు నుంచి గ్రామంలోకి వచ్చే చౌరస్తాలో రూ.5.75లక్షలతో బస్షెల్టర్ను నిర్మించారు. రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామంలో ఈ-పంచాయతీ భవనం నిర్మించారు. శివారులోని వాగు పక్కన ఏర్పాటు చేసిన ‘పల్లె ప్రకృతివనం’ పలు రకాల మొక్కలతో నందనవనాన్ని తలపిస్తున్నది. పల్లె ప్రగతిలో భాగంగా రూ.10లక్షలతో నిర్మించిన వైకుంఠధామంతో అంత్యక్రియలకు పడ్డ ఇబ్బందులు తీరాయి. వైకుంఠధామంలో రెండు దహనవాటికలతోపాటు, నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, స్నానాల గదులను నిర్మించారు. గ్రామంలోని చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా పంచాయతీ తరఫున ఇంటింటికీ చెత్తబుట్టలు పంపిణీ చేసి, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. ఆ చెత్తను కంపోస్ట్షెడ్కు తరలించి సేంద్రియ ఎరువుగా తయారు చేసి గ్రామంలో నాటిన మొక్కలకు వేసి వాటిని సంరక్షిస్తున్నారు. ‘పల్లె ప్రగతి’లో భాగంగా నెలవారీగా విడుదలవుతున్న నిధులతో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు పూర్తి చేసి బ్రాహ్మణపల్లిని బాగు చేశారు.
చింతలు తీరినై..
తెలంగాణ సర్కారు చిన్న పంచాయతీలు ఏర్పాటు చేయడం మా గ్రామానికి వరంగా మారింది. ఇంతకు మునుపు ఏ సమస్య ఉన్నా వేరే గ్రామానికి వెళ్లి, చెప్పాల్సి వచ్చేది. సపరేట్ పంచాయతీ ఏర్పాటు చేయడంతో ఇక్కడే పరిష్కారమవుతున్నాయి. సీఎం కేసీఆర్ కృషితో ‘పల్లె ప్రగతి’లో పనులు మంచిగ చేయిస్తున్నారు. మొక్కలు పెడుతున్నారు. పాడుబడ్డ బావులను మట్టితో నింపుతున్నారు. పాతకాలం నాటి ఇండ్లను కూలగొడుతున్నారు. రోడ్లను, డ్రైనేజీలను శుభ్రం చేస్తున్నారు. దోమలు రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. జ్వరం, సర్ది, దగ్గు ఎలాంటి సమస్యలు వచ్చినా గ్రామంలోనే మందులు ఇస్తున్నారు.
-పిల్లనగ్రోవి రాములు,ఎంఎస్సీ ఫారం(ఎడపల్లి)
గ్రామాభివృద్ధికి వరంగా మారింది
‘పల్లె ప్రగతి’తో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాం. ప్రారంభంలో కొంత ఇబ్బందికరంగా మారినా, ప్రతి కార్యక్రమాన్ని గ్రామస్తుల సహకారంతో విజయవంతం చేశాం. గ్రామంలో మేజర్ సమస్యలు పరిష్కారమయ్యాయి. చిన్నా చితకా సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరించు కుంటాం. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం ఎనలేనిది. సీఎం కేసీఆర్కు మా గ్రామం తరఫున కృతజ్ఞతలు.
-లక్ష్మీ రాజేందర్ రెడ్డి, సర్పంచ్
ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు
‘పల్లె ప్రగతి’ పథకం పనులతో గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. యేటా నిర్వహిస్తున్న పల్లె ప్రగతితో మేజర్ సమస్యలు పరిష్కారమవ్వడంతోపాటు, పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. గ్రామం ప్రారంభంలోని బస్టాండ్ మొదలుకొని ఊరి పొలిమేరలోని ‘వైకుంఠధామం’ వరకు అన్ని పనులు పూర్తి చేసుకున్నాం. గ్రామస్తుల సహకారం ఎనలేనిది.
-తోట ఉదయభాస్కర్, పంచాయతీ కార్యదర్శి