జీడిమెట్ల, ఏప్రిల్ 16 : అభం శుభం తెలియని ఐదేండ్ల బాలుడిని కాల్చి వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేశాడో వ్యక్తి. స్వయనా పెద్దనాన్నే ఈ దాష్టికానికి ఒడిగట్టిన ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ భగత్సింగ్నగర్కు చెందిన సాయికుమార్ మూడేండ్ల కిందట మృతి చెందాడు. అతని భార్య తన కుమారుడు నాగేంద్ర (5)ను సాయికుమార్ సోదరుడు రాజు (నాగేంద్ర పెద్దనాన్న) ఇంటి వద్ద వదిలి కొద్దిరోజుల కిందట వెళ్లిపోయింది. దీంతో బాలుడు తన పెద్దనాన్న వద్దే ఉంటున్నాడు. ఈక్రమంలో బాలుడి పెద్దనాన్న రాజు గురువారం స్టౌవ్పై స్టీల్ పాత్రను వేడి చేసి బాలుడి ముఖంపై వాతలు పెట్టాడు. ఈ విషయాన్ని స్థానికుడు మేడ్చల్ జిల్లా లీగల్ లా ప్రోహిబీషన్ అధికారి సుజాతకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే ఆమె బాలానగర్ చైల్డ్ ప్రొటక్షన్ టీం సభ్యులకు తెలియజేసింది. వెంటనే రంగంలోకి దిగిన టీం సభ్యులు భగత్సింగ్నగర్లోని రాజు ఇంటికి వెళ్లి చిత్రహింసలకు గురైన బాలుడు నాగేంద్రను జీడిమెట్ల పోలీస్స్టేషన్కు తీసుకవచ్చి ప్రథమ చికిత్స చేయించారు. దీంతో మేడ్చల్ జిల్లా లీగల్ లా ప్రోహిబీషన్ అధికారి సుజాత ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు బాలుడు పెద్దనాన్న రాజుపై కేసు నమోదు చేసుకుని బాలుడిని శిశువిహార్కు తరలించారు.