చార్మినార్, మార్చి 15 : దవాఖానకు చికిత్స నిమిత్తం వచ్చే పేషెంట్లకు మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులను ఆదేశించారు. సోమవారం చార్మినార్ సమీపంలోని యునానీ దవాఖానని అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం దవాఖానలో పేషంట్లకు అందించే చికిత్సల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం దవాఖాన సూపరింటెండెంట్ కార్యాలయంలో దవాఖాన అభివృద్ధ్దిపై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దవాఖాన ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం కొవిడ్ పరీక్షలు స్థానిక పీసీహెచ్ ప్రాంగణాల్లో కొనసాగుతున్నందున పేషంట్లకు అసౌకర్యాలు కలుగకుండా ఔట్ పేషంట్ విభాగాలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని దవాఖాన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం దవాఖాన బెడ్లు 180 కెపాసిటీని పెంచి సూపర్స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేయాలని సూచించినట్లు దవాఖాన సూపరింటెండెంట్ కవిత అధికారులకు తెలిపారు. దవాఖానలో రేడియాలజీ విభాగాన్ని పటిష్టం చేసి ఎక్స్-రే మిషనరీని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి అం దించాలని సూచించారు. కార్యక్రమంలో ప లు విభాగాల వైద్యాధికారులు, బహదూర్పూ ర మండల తాసీల్దార్ రాములు పాల్గొన్నారు.
కింగ్కోఠి జిల్లా దవాఖానలో అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ప్రజలకు సూచించారు. ఈ మేరకు సోమవారం దవాఖానలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ(హెచ్డీఎస్)సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన ఆమె కింగ్ కోఠి జిల్లా దవాఖానలో గతంలో మాదిరిగా ప్రసూతి సేవలను, ఇతర స్పెషాలిటీ సేవల్లో భాగంగా సర్జరీ, ఆర్థో, ఈఎన్టీ, డెంటల్, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, పీడియాట్రిక్ తదితర విభాగాల ఓపీ, ఐపీ సేవలను తిరిగి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని దవాఖాన పాలక వర్గానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలోని వివిధ హెచ్వోడీలతో ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దవాఖానలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని 150 పడకల సామర్థ్యంతో ఉన్న సెంటర్లో కిందిస్థాయిలో ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టులను త్వరలోనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. దవాఖానలో కొవిడ్ సేవలు కొనసాగుతాయని ప్రజలకు తెలిపారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్, ఆర్ఎంఓ డాక్టర్ వీరజ, సివిల్ సర్జన్ గైనకాలజిస్ట్ డాక్టర్ జలజ, డాక్టర్ మల్లిఖార్జున్తోపాటు పలు విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.