మేడ్చల్, జూలై 20(నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీలకు సత్వర న్యాయం జరిగేలా, ప్రభుత్వ చట్టాలు కచ్ఛితంగా అమలయ్యేలా చూడాలని, అందుకు సహకరిద్దామని మేడ్చల్ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అధికారులను ఆదేశించారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సురభి వాణీదేవి మాట్లాడుతూ, పౌర హక్కుల రక్షణ, అత్యాచార నివారణ చట్టాలను అమలు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో సభ్యులైన పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్గించేలా చూడాలన్నారు. వారికి ఏవైనా ఇబ్బందులు తలెత్తితే చట్టాన్ని ఉపయోగించి చర్యలు తీసుకోవడంతో పాటు న్యాయం జరిగేలా చూడాలని సురభి వాణీదేవి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను ఎలాంటి అట్రాసిటీ కేసులు లేని జిల్లాగా తీర్చిదిద్దుకోవాలని అక్షాక్షించారు.
జిల్లా వ్యాప్తంగా చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి అధికారులు ప్రజలకు వివరించాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో ప్రచారాలు చేయడంతో పాటు చట్టం గురించి వివరించి న్యా యం జరుగుతుందని నమ్మకం కల్గించాలన్నారు. సమావేశంలో సంచార జాతుల కమిషనర్ తుర్క నరసింహం, డీసీపీ రక్షితా కృష్ణమూర్తి, జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యా నాయక్, ఆర్డీవో మల్ల య్య, జిల్లా ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు వెంకటేశ్, ధన్లాల్ నాయక్, జిల్లా అధికారులు పా ల్గొన్నారు. సమీక్షా సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతితో పాటు అధికారులు ఘనంగా సన్మానం చేశారు.