సిటీబ్యూరో, సెప్టెంబరు 6 (నమస్తే తెలంగాణ ) : జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ సోమవారం సైఫాబాద్లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థుల హాజరును పాఠశాల ప్రిన్సిపాల్ను ఆడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి శానిటేషన్ చేశారా? లేదా? అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వారిని కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పాఠశాలకు రావాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకోవాలని, చేతులను శానిటైజ్ చేసుకొని పాఠశాలకు రావాలని చెప్పారు. పాఠశాలలకు రాని విద్యార్థులను రమ్మని చెప్పాలని విద్యార్థులకు సూచించారు.
విద్యార్థుల తల్లిదండ్రులు వ్యాక్సిన్ వేయించుకున్నారా అని ఆడిగి, వేసుకొని తల్లిదండ్రులు ఉంటే వారిని వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పవలసిందిగా కలెక్టర్ శర్మన్ విద్యార్థులను కోరారు. తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలని, పాఠశాల పరిసరాలలో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేసి మొక్కలను నాటుకోవాలని సూచించారు.
ఉపాధ్యాయులందరు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించి వాటిని ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచాలని శర్మన్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రదానోపాధ్యాయురాలు అర్చన, ఇతర ఉపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి, ఫాతిమాలు పాల్గొన్నారు.