మణికొండ, జూలై 3: నగర శివారు ప్రాంతాలైన మున్సిపాలిటీలు ప్రగతి పథంలో నడిపించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా ముందుకు సాగాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. పట్టణప్రగతిలో భాగంగా మూడోరోజు మణికొండ మున్సిపాలిటీలోని ఈవివికాలనీలో స్థానిక మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, కౌన్సిలర్లతో కలిసి వారు మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారు అధికారం చేపట్టిన ఏడేళ్లకాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామంలో డంపింగ్యార్డు, పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటికల నిర్మాణం చేసుకోవడం జరుగుతుందన్నారు.
రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మున్సిపాలిటీలో పచ్చదనం పెంపొందుతుందన్నారు. ప్రభుత్వం తలపెట్టిన పట్టణప్రగతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు విధిగా భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. అనంతరం మణికొండ మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన నర్సరీలను వారు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్, ఆర్డీవో చంద్రకళ, మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, ఇన్చార్జి కమిషనర్ సాజీద్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
పట్టణప్రగతిలో భాగంగా కలెక్టర్ అమయ్కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్లు నార్సింగి మున్సిపాలిటీ తొమ్మిదో వార్డులో పర్యటించి మున్సిపల్ చైర్పర్సన్ రేఖ, వైస్ చైర్మన్ వెంకటేశ్యాదవ్, కౌన్సిలర్లతో కలిసి మొక్కలను నాటారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో ఏర్పా టు చేసిన నర్సరీలను పరిశీలించారు. కార్యక్రమంలో కమిషనర్ సత్యబాబు, డీఈఈ నరసింహ రాజు, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.