శిల్ప సౌందర్యం.. పసుపు వర్ణపు ధగధగలు
15వ సారి యాదాద్రిని సందర్శించిన కేసీఆర్
త్వరలోనే భక్తకోటికి స్వామివారి మూలవరుల దర్శన భాగ్యం
పూర్తిగా కృష్ణశిలలతో సంప్రదాయ హంగులతో నిర్మితమైన యాదాద్రి పసిడి వర్ణపు కాంతులతో ధగధగా మెరిసిపోతున్నది. యాదాద్రి ఆలయం ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని అమెరికా, రష్యన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆలయం ప్రాంగణమంతా బంగారు, పసుపు వర్ణంలో మెరిసేలా లైటింగ్ ఏర్పాటు చేశారు. ఆళ్వార్, యూని పిల్లర్లు, ప్రహ్లాద ఘట్టాలు, అష్టభుజి ప్రాకార మండపం, ఆలయ మండపాలు విద్యుత్ కాంతుల్లో జిగేల్మంటూ కనివిందు చేస్తున్నాయి. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ 15వసారి యాదాద్రిని సందర్శించి మేలివర్ణంలో కాంతులీనుతున్న కృష్ణశిలల అద్భుతాన్ని పరిశీలించారు. వలయదారి నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. యాదాద్రికి వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ బాలాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయగా, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు జి. జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ ఉన్నారు.