సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వారికి సీఎం కేసీఆర్ కొండంత భరోసా ఇచ్చారు. బుధవారం గాంధీ వైద్యశాలను సందర్శించిన ఆయన రోగులను ఆప్యాయంగా పలుకరించారు. వారి బాగోగులు తెలుసుకొని.. ధైర్యం చెప్పడంతో బాధితులకు సాంత్వన చేకూరింది. మహమ్మారిని జయించగలమనే ఆత్మ ైస్థెర్యాన్ని నింపింది. వేలాది మంది ప్రాణాలను కాపాడిన గాంధీ దవాఖానపై సామాన్యుల్లో మరింత విశ్వాసాన్ని ప్రోది చేసినట్లయ్యింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏమాత్రం లోపాలు లేకుండా రోగులకు వైద్య సేవలు సాఫీగా అందుతున్నాయని, సీఎం కేసీఆర్ పరామర్శ సందర్భంగా రోగులు, వారి బంధువులు వెలిబుచ్చిన సంతృప్తి.. ప్రభుత్వ వైద్య రంగం ఎంత పటిష్టంగా ఉందనేది తెలియజేస్తున్నది.
నెలల తరబడి కొవిడ్ బాధితుల సేవల్లో తలమునకలైన వైద్యారోగ్య యంత్రాంగంలోనూ ముఖ్యమంత్రి పర్యటన నూతనోత్తేజాన్ని ఇచ్చింది. ‘మీ సమస్యలన్నీ నాకు తెలుసు… మీతో మాట్లాడతాను’ అంటూ కేసీఆర్ వాళ్లకిచ్చిన హామీతో యంత్రాంగమంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నది. క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండి సేవలు అందిస్తున్న వైద్యులను ఈ సందర్భంగా సీఎం అభినందించినట్లు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి తెలిపారు.