హైదరాబాద్ : తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. పోలీస్ శాఖకు తెలంగాణ ప్రభుత్వం తగిన కేటాయింపులు చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఆ తర్వాత పోలీస్ శాఖలో మార్పులను స్పష్టంగా గమనించొచ్చని అన్నారు. సీఎం ఆధ్వర్యంలో పోలీస్ శాఖలో ఎన్నో మార్పులు తెచ్చామని డీజీపీ గుర్తుచేశారు. శనివారం ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేరాలు అరికట్టడం, ఫ్రెండ్లీ పోలీసింగ్లో దేశానికే ఆదర్శంగా నిలిచామని చెప్పారు. ఆధునాతన సౌకర్యాలతో పోలీస్ స్టేషన్ భవనాలు నిర్మిస్తున్నామని, పోలీసులపై ప్రజల్లో నమ్మకాన్ని తీసుకొచ్చామని డీజీపీ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో 6 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. నేరాలను అరికట్టడంలో సీసీకెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఆయన అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.