మెదక్, మే 20: కరోనా విషయంలో ఎవ రూ ఆందోళన, అధైర్య పడవద్దని సీఎం కేసీఆరే స్వయంగా గాంధీ దవాఖానకు వెళ్లి కరోనా పేషెంట్లలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కరో నా రోగులను ఇలా పరామర్శించలేదని, ఇది అరుదైన విషయమని చెప్పారు. గురువారం మెదక్ జిల్లాకేంద్ర దవాఖానను ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో కలిసి ఆయన తనిఖీ చేశారు. అనంతరం కలెక్టరేట్లో కరోనా, ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కరోనా రోగులు ధైర్యంగా ఉండాలని.. వారికోసం ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తున్నదని చెప్పారు. వీలైనంత తొందరగా ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 10 లక్షల కొవాగ్జిన్ టీకాలు కొనుగోలు చేయనున్నదని చెప్పారు. అవి రాగానే జనం మధ్య తిరిగే, 18-45 ఏండ్లలోపు వయసు ఆటోరిక్షా, ట్యాక్సీ, రేషన్ డీలర్లు, కూరగాయలు, పండ్లు, మాంసం విక్రయించేవారు, చిరువ్యాపారులు, పేపర్ బాయ్స్, గ్యాస్ డెలవరీ బాయ్స్ తదితరులకు టీకా ఇస్తామని హరీశ్రావు ప్రకటించారు. రోజుకు 400 నుంచి 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేస్తున్నామని తెలిపారు. వైద్యసిబ్బంది, కలెక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, పారామెడికల్ సిబ్బంది వారి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని, లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని కోరారు.