జాగ్రత్తలతోనే నివారణ
జిల్లాలో నలుగురికి లక్షణాలు
నమస్తే’తో నిర్మల్ జిల్లా వైద్యాధికారి ధన్రాజ్
నిర్మల్ చైన్గేట్, మే 20: కరోనా విస్తరిస్తున్న తరుణంలో మరోవైపు కొత్తగా బ్లాక్ ఫంగస్ ప్రజలను భయాందోళన కలిగిస్తున్నది. సరైన జాగత్తలు తీసుకుంటే ఈ వైరస్ను నివారించవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. బ్లాక్ ఫంగస్ ప్రాణాంతకమైన వ్యాధి కాదని చికిత్స ద్వారా కోలుకోవచ్చంటున్నారు. నిర్మల్ జిల్లాలో నలుగురికి లక్షణాలు కనిపించడంతో జిల్లా వైద్యాధికారులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని సరోజనీదేవి కంటి దవాఖానకు తరలించారు. బ్లాక్ ఫంగస్ పై జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ అభిప్రాయాలు తెలియజేశారు.
నమస్తే: బ్లాక్ ఫంగస్ ఎలా సోకుతుంది, లక్షణాలు ఏవిధంగా ఉంటాయి.?
జిల్లా వైద్యాధికారి: బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి రోగనిరోధకశక్తి క్షీణించిన వారికి సోకుతుంది. కరోనా నుంచి కోలుకున్న వారికి, అత్యధికంగా స్టెరాయిడ్స్ వాడే వారికి, మధుమేహం ఉన్నవారికి, హెచ్ఐవీ వ్యాధి గ్రస్తులకు, అవయవ మార్పిడి చేసుకున్న వారికి త్వరగా సోకే ఆస్కారం ఉంది. రోగ నిరోధకశక్తి ఉన్నవారికి ఈ వ్యాధి సోకదు. ముక్కు కారడం, కంటివాపు వంటి వ్యాధులు ఏర్పడుతాయి. మెదడుకు సోకుతుంది. ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారించవచ్చు. ఈ వ్యాధి సోకినా చికిత్స ద్వారా నయమవుతుంది.
నమస్తే: ఈ వ్యాధి అందరికి సోకుతుదా ?
వైద్యాధికారి: ఇది అంటువ్యాధి కాదు. రోగనిరోధకశక్తి ఉన్నవారికి సోకదు. ప్రజలు ఆందోళన చెందవద్దు.
నమస్తే: జిల్లాలో ఎంతమందిని గుర్తించారు ?
వైద్యాధికారి: జిల్లాలో ఇప్పటివరకు నలుగురికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించాం. వారిని వెంటనే హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి దవాఖానకు తరలించాం.
నమస్తే: లక్షణాలు కనిపిస్తే ఎవరిని సంప్రదించాలి.?
వైద్యాధికారి: ఇప్పటికే వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ దవాఖానలలో వైద్యులను సంప్రదించాలి. నిర్ధారణయితే వారిని చికిత్స కోసం ఉన్నత వైద్యశాలలకు పంపిస్తాం.