చిక్కడపల్లి, జూన్ 13: బ్రాహ్మణులు, అర్చకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమని, సీఎం కేసీఆర్ కృషి అమోఘమని అని తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షుడు, వరంగల్ వెయ్యి స్తంభాల దేవాలయం ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ అన్నారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం చిక్కడపల్లిలోని శ్రీ కోనసీమ ద్రావిడ సంఘం హాల్లో పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గంగు ఉపేంద్ర శర్మ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందిస్తున్నారని అన్నారు.
తెలంగాణ బ్రహ్మణ సంక్షేమం పరిషత్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించారని తెలిపారు. భారత సంస్కృతి సంప్రదాయాలకు మూల స్తంభాలు దేవాలయాలని, వాటిని పరిరక్షిస్తుంది బ్రాహ్మణులని అన్నారు. అలాంటి బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ద్రావిడ సంఘం ఉపాధ్యక్షుడు త్రిమూర్తి, బీఎస్ఎస్ సెంట్రోల్ జోన్ కార్యదర్శి జి.మురళీ ప్రసాద్, బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బాల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి మోహన్ కుమార్ గాంధీ పాల్గొన్నారు.