సిటీబ్యూరో, జూలై 30 ( నమస్తే తెలంగాణ ) : సిటీలో థియేటర్లు శుక్రవారం నుంచి మళ్లీ తెరుచుకోవడంతో సినీ కోలాహలం మొదలైంది. ఎప్పుడెప్పుడా అని కొన్ని రోజులుగా ఎదురుచూసిన ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన జనం థియేటర్ల బాట పట్టారు. వెండితెరపై వెలుగులను ఆస్వాదించారు. కరోనా కారణంగా సినిమా హాళ్లు మూతపడిన విషయం తెలిసిందే. ఫలితంగా సగటు ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ లేక సతమతమయ్యారు. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం వంద శాతం అక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోవచ్చని అనుమతి ఇవ్వడంతో మళ్లీ సినీ పండుగ షురువైంది. తొలి రోజు నరసింహపురం, ఇష్క్, తిమ్మరసు, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు, పరుగెత్తు పరుగెత్తు.. తదితర చిత్రాలు విడుదలయ్యాయి.
అయితే ఇప్పటికే సార్పట్ట, నారప్పలాంటివి అమెజాన్ ప్రైమ్లో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థియేటర్లలో ప్రేక్షకుల స్పందన బట్టీ పెద్ద సినిమాల విడుదల తేదీలు ప్రకటించే అవకాశం ఉందని సినీ ప్రముఖులు చెబుతున్నారు.
ప్రతీ థియేటర్ వద్ద కరోనా నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మాస్క్ లేకుండా ఎవరినీ లోనికి అనుమతించడం లేదు. ఎంట్రీలో ఆటోమెటిక్ శానిటైజింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. టెంపరేచర్ చెక్ చేసిన అనంతరమే లోపలికి అనుమతిస్తున్నారు. వంద శాతం అక్యుపెన్సీ కావడంతో ప్రతీ సీటు ఆవరణను పూర్తిగా శానిటైజేషన్ చేస్తున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతీ షోకు శానిటైజేషన్ తప్పనిసరిగా చేస్తున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మొత్తం 150 మల్టీప్లెక్స్లు, 160 సింగిల్స్క్రీనింగ్ థియేటర్లు ఉన్నాయి. పీవీఆర్, ఇనార్బిట్ వంటి వాటిలో 150 వరకు సీట్లు ఉంటాయి. ఐమాక్స్ వంటి వాటిలో 400 వరకు సీటింగ్ కేపాసిటీ ఉంది. టికెట్ ధర రూ.150 అనుకుంటే .. 150 ఉన్న మల్టీప్లెక్స్లకు ఒక షోకు 22,500 వరకు ఆదాయం లభిస్తుంది. 400 సీట్లున్న మల్టీప్లెక్స్లో ఒక షోకు రూ.60 వేలకుపైగానే రాబడి ఉంటుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లో సీటింగ్ కెపాసిటీ 300 నుంచి 400 వరకు ఉంటే.. టికెట్ ధరలు గ్రేడ్ను బట్టీ ఉంటాయి. అయితే థియేటర్లు ఆడియన్స్తో పూర్తిగా నిండినప్పుడే ఆశించిన ఆదాయం వస్తుంది.