సిటీ బ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ప్రతి రోజూ వ్యాయామం, సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా మన శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చని ఆధ్యాత్మిక గురువు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి పేర్కొన్నారు. డాక్టర్ అభినవ్రావు ఆధ్వర్యంలో ఖాజాగూడలో అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన శంతను డయాగ్నస్టిక్ క్లినిక్ను చినజీయర్ స్వామి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి ఆరో గ్యం కోసం లాభాపేక్ష లేకుండా ఈ కేంద్రాన్ని నిర్వహించాలని సూచించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే టెస్టులు చేస్తామన్న నిర్వాహకులను స్వామీజీ ఈ సందర్భంగా అభినందించారు. మైహోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్రావు మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన తరుణంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నామ మాత్రపు ధరలకు అన్నిరకాల టెస్ట్లు చేస్తామని శంతను క్లినిక్ ఫౌండర్ అభినవ్రావు తెలిపారు. అనంతరం శంతను డయాగ్నస్టిక్ క్లినిక్ డైరెక్టర్ శ్రీలక్ష్మి జూపల్లి, వైద్యులు, సిబ్బందిని చినజీయర్స్వామి ఆశీర్వదించారు.