శంషాబాద్, మే 22: సమాజంలో ఆధ్యాత్మికత, సత్కర్మలు, యజ్ఞయాగాదులతోనే మానవాళి మనుగడ, జగద్రక్షణ సాధ్యమని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ఉద్భోదించారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధి శ్రీరామనగరంలోని దివ్య సాకేతంలో శనివారం వేదపండితులు అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, విశ్వక్సేనారాధన, శ్రీ సీతారామచంద్రుడు, పరమపద నాధుడి అర్చనలు, చంద్రప్రభ సేవ, సర్వదేవతాహ్వానంతో 3వ రోజు పుష్కర బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. స్వామి వారి స్వీయ పర్యవేక్షణలో దివ్యసాకేత నాధుడి (శ్రీ సీతారాముల) కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి మై హోం గ్రూప్ సంస్థల అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు హాజరయ్యారు.