హయత్నగర్ : 15 నుండి 18 సంవత్సరాల లోపు విద్యార్థులు, యువతీయువకులు తప్పకుండా కొవిడ్ రాకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచించారు. మంగళవారం హయత్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆధార్ కార్డు నెంబర్లతో స్మార్ట్ ఫోన్లలో యాప్ డబ్ల్యుఐఎన్ ద్వారా కొవిడ్ టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సహకారంతో ప్రభుత్వ జూనియర్, ప్రైవేట్ కళాశాలల్లో వైద్య సిబ్బంది ద్వారా కొవిడ్ టీకాలు వేయించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
సరూర్నగర్, హయత్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేసి గురువారం నుండి వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని వెల్లడించారు. ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మొదటి దశలోనే ప్రతిఒక్కరూ కొవిడ్ టీకాలు తప్పకుండా వేయించుకుని కరోనా నియంత్రణకు కృషిచేయాలన్నారు.
హయత్నగర్లోని 740 మంది విద్యార్థులకు ఒకటి, రెండు రోజుల్లో వ్యాక్సిన్ను పూర్తి చేస్తామని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు 50వేల మంది విద్యార్థులు ఉన్నట్లుగా గుర్తించామని, పూర్తిస్థాయిలో అందరికీ వ్యాక్సిన్ వేయించేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు.
మొదటి డోసు తీసుకున్న విద్యార్థులు 28 రోజుల అనంతరం సెకండ్ డోసు తీసుకోవాలని వివరించారు. ఈ సందర్భంగా కళాశాల సమస్యలను విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా కళాశాలలోని మంచినీటి సమస్య, విద్యుత్, ఫ్లోరింగ్ సమస్యలు, లెక్చరర్ నియమానికి సత్వరమే చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, మాజీ కార్పొరేటర్లు సామ తిరుమలరెడ్డి, కొప్పుల విఠల్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ హయత్నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్గౌడ్, మాజీ అధ్యక్షుడు గుడాల మల్లేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.